Begin typing your search above and press return to search.

ఏఎంబీ సినిమాస్‌ లో శృతీహాస‌న్ హంగామా!

By:  Tupaki Desk   |   9 Sep 2022 2:16 PM GMT
ఏఎంబీ సినిమాస్‌ లో శృతీహాస‌న్ హంగామా!
X
ఈ మ‌ధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ న‌డుస్తోంది. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `పోకిరి` ఇటీవ‌ల 4 కె ఫార్మాట్ లో మ‌హేష్ పుట్టిన రోజున రీ రిలీజ్ అయి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఫ్యాన్స్ ఈ మూవీతో పాటు `ఒక్క‌డు` సినిమాని కూడా ఓ రేంజ్ లో థియేట‌ర్ల‌లో ఎంజాయ్ చేశారు. ఆ త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `జ‌ల్సా` మూవీని కూడా 4కె లోకి మార్చి సెప్టెంబ‌ర్ 2న పుట్టిన రోజు కానుక‌గా రీ రిలీజ్ చేశారు. ఇదే మూవీతో పాటు `త‌మ్ముడు` మూవీని కూడా థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

రీ రిలీజ్ లో `జ‌ల్సా` రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి `పోకిరి` రికార్డుని బ‌ద్ద‌లు కొట్టింది. ఫ్యాన్స్ ఇలా ఇద్ద‌రు హీరోల‌కు సంబంధించిన సినిమాలు మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత రీరిలీజ్ కావ‌డంతో ఆనందంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇదే త‌ర‌హాలో స‌రిగ్గా ప‌దేళ్ల క్రితం విడుద‌లైన `3` మూవీని మ‌ళ్లీ రీ రిలీజ్ చేశారు. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఈ మూవీలో శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టించింది. త‌మిళంలో శృతి న‌టించిన తొలి చిత్రం ఇదే కావ‌డం విశేషం.

ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్యా ర‌జ‌నీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌వుతున్న నేప‌థ్యంలో ఈ యూవీని ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ధాన థియేట‌ర్ల‌లో, మ‌ల్టీప్లెక్స్ ల‌లో రిలీజ్ చేశారు. హైద‌రాబాద్ గ‌చ్చిబౌలీలోని ఎఎమ్ బీ సినిమాస్ లోనూ ఈ మూవీని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ప‌దేళ్ల త‌రువాత విడుద‌లైన ఈ మూవీ బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సినిమా రీ రిలీజ్ అయిన విష‌యాన్ని తెలుసుకున్న హీరోయిన్ శృతిహాస‌న్ ప్రేక్ష‌కుల‌ని స‌ర్ ప్రైజ్ చేసింది.

హైద‌రాబాద్ గ‌చ్చిబౌలిలోని ఎఎమ్ బీ సినిమాస్ కు షో ర‌న్న‌వుతుండ‌గానే మ‌ధ్య‌లో థియేట‌ర్ లోకి వెళ్లి హంగామా చేసింది. సినిమాలో త‌ను పాడిన `క‌న్నుల‌దా...` అంటూ సాగే పాట‌ని ప్రేక్ష‌కుల కోసం పాడి వినిపించ‌డంతో ప్రేక్ష‌కులు ఒక్క‌సారిగా ఆరులు.. కేక‌ల‌తో త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. ఇదే సంద‌ర్భంగా సినిమాలోని ఓ డైలాగ్ ని చెప్ప‌మ‌ని అడిగారు. అయితే ప‌దేళ్ల‌వుతోంది సినిమా వ‌చ్చి డైలాగ్స్ గుర్తు లేవ‌ని చెప్పిన శృతి త‌న కొత్త సాంగ్ వీడియో రిలీజ్ అవుతోంద‌ని దానికి మీ అంద‌రి స‌పోర్ట్ కావాల‌ని అడిగింది.

థియేట‌ర్లో చేసిన సంద‌డికి సంబంధించిన వీడియోని ఇన్ స్టా రీల్స్ లో పోస్ట్ చేయ‌డంతో అది ఇప్ప‌డు నెట్టింట వైర‌ల్ గా మారింది. శృతిహాస‌న్ ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తున్న మూవీ, చిరంజీవి న‌టిస్తున్న `వాల్తేరు వీర‌య్య‌`, ప్ర‌భాస్ తో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న `స‌లార్‌` సినిమాల్లో న‌టిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.