Begin typing your search above and press return to search.

హీరోయిన్లు మూడేసి క‌మిట్ మెంట్లు ఇవ్వాలా?

By:  Tupaki Desk   |   5 Feb 2022 1:30 AM GMT
హీరోయిన్లు మూడేసి క‌మిట్ మెంట్లు ఇవ్వాలా?
X
టాలీవుడ్ లో ఒక సాంప్ర‌దాయం ఉంది. ఎవ‌రైనా హీరో లేదా హీరోయిన్ తో మూడు సినిమాల డీల్ కుదుర్చుకుని ప్రాజెక్ట్ ని సేఫ్ గేమ్ గా మ‌లుచుకోవ‌డం అన్న ఫార్ములాని కొంద‌రు నిర్మాత‌లు అనుస‌రిస్తున్నారు. న‌టించిన ఒక‌టో సినిమాతోనే పెద్ద స్టార్ డ‌మ్ అందుకుని ఆ త‌ర్వాత పారితోషికాలు పెంచేసే హీరోలు హీరోయిన్ల‌కు ముకుతాడు వేసేందుకు కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతోంది. దిల్ రాజు .. అల్లు అర‌వింద్ వంటి వారు ఇలాంటి యుక్తిని ఉప‌యోగించారు.

ఇక ద‌ర్శ‌కుల్లో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ శైలి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. త‌న‌కు న‌చ్చిన పెర్ఫామ‌ర్ తో అత‌డు మూడు సినిమాల కాంట్రాక్ట్ కుదుర్చుకుంటున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. అయితే ముఖ్యంగా క‌థానాయిక‌ల‌తో అత‌డు వెసులుబాటును చూస్తారు. తాను రాసుకున్న పాత్ర‌కు స‌రిప‌డే నాయిక‌ను ఎంచుకుని లేదా అందాల న‌టీమ‌ణి ప్ర‌ద‌ర్శ‌న‌ స్థాయికి త‌గ్గ పాత్ర‌ను తీర్చిదిద్ది అత‌డు ఎంపిక‌లు సాగిస్తున్నారు. దర్శ‌క‌ర‌చ‌యిత‌గా బ‌ల‌మైన పాత్ర‌ల్ని సృష్టించే త్రివిక్ర‌మ్ నాయిక‌ల‌కు బ‌ల‌మైన పాత్ర‌ల్ని రాస్తారు. అత‌డితో ప‌ని చేశాక ఏ నాయిక‌కు అయినా ఇమేజ్ అమాంతం మారిపోతుంది. అందుకే త‌న‌తో రిపీటెడ్ గా ప‌ని చేసేందుకు హీరోయిన్లు ఇష్ట‌ప‌డ‌తారు.

త్రివిక్రమ్ ఒకే హీరోయిన్ తో ఒకసారి కాదు మూడుసార్లు పని చేయడానికి సుముఖత చూపిస్తుంటారు. స‌మంత‌.. పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్ల‌ను అత‌డు మూడు సార్లు రిపీట్ చేయ‌డం విశేషం. అత్తారింటికి దారేది - స‌న్నాఫ్‌ సత్యమూర్తి - అ ఆ చిత్రాల్లో స‌మంత‌కు అవ‌కాశం క‌ల్పించారు త్రివిక్ర‌మ్.

ఇప్పుడు పూజా హెగ్డేతోనూ మూడోసారి ప‌ని చేస్తున్నారు. అరవింద సమేత- అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల్లో న‌టించిన పూజాకు ఇప్పుడు మ‌హేష్ స‌ర‌స‌న త్రివిక్ర‌మ్ సినిమాలో అవ‌కాశం ద‌క్కింది. మ‌హేష్ న‌టిస్తున్న 28వ సినిమా తాజాగా లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. మ‌హేష్ - పూజా హెగ్డే కాంబినేష‌న్ లో త్రివిక్ర‌మ్ పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో పూజా పాత్ర‌కు న‌ట‌న ప‌రంగా బిగ్ స్కోప్ ఉండ‌నుందిట‌.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమంలో నమ్రతా శిరోద్కర్ పాల్గొన్నారు. సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేయగా.. న‌మ్ర‌త‌ క్లాప్ నిచ్చి ప్రారంభించారు. ఈ వేడుక‌కు మ‌హేష్ అటెండ్ కాలేదు. ఇక ఎలాంటి సెంటిమెంట్లు న‌మ్మ‌ని త్రివిక్ర‌మ్ కేవ‌లం ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగానే ఎంపిక‌లు సాగిస్తార‌ని మ‌రోసారి పూజా ఎంపిక‌తో ప్రూవ్ అవుతోంది.