Begin typing your search above and press return to search.

ఆగ‌స్టు 22 నుంచి షూటింగ్స్ తిరిగి షూరూ!

By:  Tupaki Desk   |   18 Aug 2022 10:09 AM GMT
ఆగ‌స్టు 22 నుంచి షూటింగ్స్ తిరిగి షూరూ!
X
ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల బంద్ అంటూ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ స‌భ్యులు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. క‌రోనా త‌రువాత మారిన ప‌రిస్థితులు, పెరిగిన బ‌డ్జెట్ లు, ఆర్టిస్ట్ ల అత‌న‌పు ఖ‌ర్చులు, రెమ్యున‌రేష‌న్ లు అంటూ లెక్క‌లు చెబుతూ షూటింగ్ ల బంద్ ఒక్క‌టే దీనికి ప‌రిష్కారంగా భావిస్తూ బంద్ కి పిలుపునిచ్చారు. అయితే ఈ బంద్ కు తాము పూర్తిగా వ్య‌తిరేకం అని ప్ర‌క‌టించిన నిర్మాత‌ల మండ‌లి ఆ త‌రువాత బంద్ కు త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తుని తెలిపింది.

దీంతో ఆగ‌స్టు 1 నుంచి మునుపెన్న‌డూ లేనంత‌గా సినిమాల షూటింగ్ లు నిర‌వ‌ధికంగా నిలిచిపోయాయి. స్టార్ హీరోల సినిమాల షూటింగ్ ల నుంచి చిన్న హీరోల షూటింగ్ ల వ‌ర‌కు ఏ సినిమా కూడా సెట్ లో లేదు. అన్నీ ఆగిపోయాయి. షూటింగ్ లు నిలిపివేసి గురువారానికి 18 రోజులు అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి గురువారం బ‌య‌టికి వ‌చ్చింది. ఏంటంటే ఆగ‌స్టు 22 నుంచి య‌ధావిధిగా సినిమాల షూటింగ్ ల‌ని తిరిగి ప్రారంభించ‌బోతున్నార‌ట‌.

షూటింగ్ లు నిలిపివేసి దాదాపు రెండు వారాల‌కు మించి అవుతుండ‌టంతో గురువారం ఫిల్మ్ ఛాంబ‌ర్ దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేయాల‌ని ప్ర‌త్యేకంగా సాయంత్రం మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గురువారం సాయంత్రం 5 గంట‌ల‌కు ఈ మీటింగ్ ని ప్రారంభించ‌బోతున్నార‌ని తెలిసింది. ఇండ‌స్ట్రీలో నిలిచిపోయిన సినిమాల షూటింగ్ ల‌ని తిరిగి ప్రారంబించాల‌నే ఆలోచ‌న‌కు నిర్మాత‌లు వ‌చ్చిన‌ట్టుగా చెబుతున్నారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచిన మూడు సినిమాలే అని తెలుస్తోంది. ఆగ‌స్ట 5న విడుద‌లైన క‌ల్యాణ్ రామ్ 'బింబిసార‌', దుల్క‌ర్ స‌ల్మాన్ 'సీతారామం' రిలీజైన తొలి రోజు తొలి ఆట‌తో యునానిమ‌స్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్ ని సొంతం చేసుక‌ని విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్నాయి. ఇక ఆగ‌స్టు 13న నిఖిల్ న‌టించిన 'కార్తికేయ 2' విడుద‌లై ద‌క్షిణాదిలో పాటు ఉత్త‌రాదిలోనూ విజ‌య‌దుందుభి మోగిస్తూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది.

ఈ మూడు సినిమాల‌తో మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో పూర్వ వైభ‌వం మొద‌లైంది. టాలీవుడ్ లో కొత్త కళ సంత‌రించుకుంది. ఈ నేప‌థ్యంలోనే నిర్మాత‌ల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయ‌ని, తిరిగి షూటింగ్ ల‌ను ఆగ‌స్టు 22 నుంచి య‌ధ‌విధిగా ప్రారంభించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని తెలుస్తోంది.

అంటే కాకుండా ఆగ‌స్టు 24 నుంచి హీరో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌మ సినిమాల షూటింగ్ ల‌ని తిరిగి ప్రారంభించ‌నున్నామ‌ని ఇప్ప‌టికే ఆల్టిమేట‌మ్ జారీ చేశారు. ఈ నేప‌థ్యంలోనే గురువారం నిర్మాత‌లు ప్ర‌త్యేకంగా భేటీ అయి ఆగ‌స్టు 22 నుంచి షూటింగ్ లు తిరిగి ప్రారభించాల‌నే నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌ని తెలిసింది.