Begin typing your search above and press return to search.

శిల్పా శెట్టి భర్తకి ఈడీ సమన్లు

By:  Tupaki Desk   |   29 Oct 2019 11:36 AM GMT
శిల్పా శెట్టి భర్తకి ఈడీ సమన్లు
X
ప్రముఖ పారిశ్రామికవేత్త - నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మనీ లాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. గ్యాంగ్‌ స్టర్‌ ఇక్బాల్ మిర్చి‌తో సంబంధాల నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. మనీలాండరింగ్ కేసులో రంజిత్ బింద్రాతో జరిపిన ఆర్థిక లావాదేవీలను ఈడీ తీవ్రంగా పరిగణిస్తుంది.

రంజిత్ బింద్రాతో కొనసాగిన ఆర్థిక వ్యవహారాల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయనే విషయం ఈడీ దృష్టికి వెళ్లడంతో వాటి వివరాలు సేకరించేందుకు రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేసారు. ముంబైలో విలువైన ఆస్తుల అమ్మకాలు - కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్టు ఈడీ భావించింది. ఈ వ్యవహారంలో ఇక్బాల్ మిర్చి పై క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత 2013లో గుండెపోటుతో మిర్చి మరణించాడు. కాగా, ఇదే కేసులో గతంలో బింద్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుంద్రా ఖండించారు.

గత కొద్దికాలంగా ఈడీ అధికారులు రాజ్ కుంద్రా - రంజిత్ బింద్రాకు సంబంధించిన వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. గత కొద్ది నెలలుగా పలుమార్లు మెరుపు దాడులు చేసి కీలకమైన సమాచారాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ కేసులో రాజ్ కుంద్రా నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఈడీ రంగం సిద్ధం చేసింది. దీంతో ఈ కేసు ఉచ్చు గట్టిగానే బిగిసే అవకాశం ఉందనే మాటలు రాజకీయ - వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్నాయి.