Begin typing your search above and press return to search.

మహానటి పాటతో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' నవరాత్రి స్పెషల్..!

By:  Tupaki Desk   |   7 Oct 2021 2:30 PM GMT
మహానటి పాటతో ఆడవాళ్లు మీకు జోహార్లు నవరాత్రి స్పెషల్..!
X
వర్సటైల్ హీరో శర్వానంద్ - లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. టైటిల్ ని బట్టి చూస్తే ఈ చిత్రంలో మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని అర్థం అవుతోంది. దీనికి తగ్గట్టుగానే ఖుష్బూ - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి వంటి ముగ్గురు ఎవర్‌ గ్రీన్ నటీమణులను ఇందులో కీలకమైన మూడు పాత్రల్లో నటింపజేస్తున్నారు. వీరందరూ సెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది.

తాజాగా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్స్ లో నవరాత్రి స్పెషల్ గా చిత్ర బృందం ఓ వీడియోని రిలీజ్ చేసింది. ఇందులో రాధిక - రష్మిక - ఊర్వశి కలిసి తమదైన హావభావాలతో 'నవరాత్రి.. శుభరాత్రి' అనే క్లాసిక్ సాంగ్ కు పెర్ఫార్మ్ చేస్తూ కనిపించారు. సెట్ లో మహానటి సావిత్రి నటించిన పాటను గుర్తు చేసుకున్న ఈ ఆడవాళ్లు.. ఆమెకు ఈ విధంగా జోహార్లు తెలిపారు. వీరందరూ కలిసి రేపు స్క్రీన్ మీద ఎలాంటి పెర్ఫార్మన్సెస్ తో అలరిస్తారో చూడాలి.

కాగా, శర్వానంద్ - రష్మిక - కిషోర్ తిరుమల కలయికలో వస్తున్న ఫస్ట్ సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ - రవిశంకర్ - సత్య - ప్రదీప్ రావత్ - గోపా రాజు - బెనార్జీ - కళ్యాణి నటరాజన్ - రాజశ్రీ నాయర్ - ఝాన్సీ - రజిత - సత్య కృష్ణ - ఆర్‌సిఎం రాజు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'లూసిఫర్' ఫేమ్ సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వ‌హిస్తున్నారు.