Begin typing your search above and press return to search.

శర్వానంద్ మంచి ప్లానే వేశాడుగా...?

By:  Tupaki Desk   |   9 May 2020 12:10 PM GMT
శర్వానంద్ మంచి ప్లానే వేశాడుగా...?
X
యువ హీరో శర్వానంద్ చిన్న చిన్న పాత్రలతో సినీ కెరీర్ స్టార్ చేసి ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన చిత్రాలను సెలెక్ట్ చేసుకుంటూ వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. 'గమ్యం' 'ప్రస్థానం' 'అందరి బంధువయా' 'రన్ రాజా రన్' 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' 'ఎక్సప్రెస్ రాజా' 'శతమానం భవతి' 'మహానుభావుడు' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే కొంతకాలంగా శర్వానంద్ వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. 'ప‌డి ప‌డి లేచే మ‌న‌సు' 'ర‌ణ రంగం' 'జాను' చిత్రాలు ఆశించిన విజ‌యాన్ని సాధించ‌క‌పోవ‌డంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు శర్వా. ఈ నేపథ్యంలో 'శ్రీకారం' అనే సినిమాకి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రానికి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా 14 రీల్స్ రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. హీరోయిన్ గా 'గ్యాంగ్ లీడ‌ర్' ఫేమ్ ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఇప్పటికి వరకు రిలీజైన ప్రచార చిత్రాలను బట్టి ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే రైతులు - వ్యవసాయం నేపథ్యంలో ఉండబోతోందని అర్థం అవుతోంది. దాదాపుగా చిత్రీకరణ చివరి దశకు వచ్చిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

కాగా ఇటీవలే అజయ్ భూపతి 'మహా సముద్రం' సినిమాలో నటించడానికి పచ్చజండా ఊపిన శర్వానంద్.. మరో సినిమాని కూడా ఓకే చేసాడని సమాచారం. ఈ సినిమా తరువాత ఆయన 'సవ్యసాచి' 'కార్తికేయ' చిత్రాల డైరెక్టర్ చందూ మొండేటితో కలిసి ఒక పిరియాడిక్ ప్రేమకథా చిత్రం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం 1910 - 2021 మ‌ధ్య కాలం నేప‌థ్యంలో చిత్ర క‌థ సాగుతుంద‌ని సమాచారం. దీనిని బట్టి కథ పూర్తి వైవిధ్యభరితంగా ఉండబోతోందని చెప్పవచ్చు. ఇప్పుడు టాలీవుడ్ నుండి ప్రతీ హీరో పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తున్న ఈ తరుణంలో శర్వా కూడా అదే ప్లాన్ లో ఉన్నాడట. ప్రస్తుతం చందూ మొండేటి 'కార్తికేయ 2' సినిమా పనులతో బిజీగా వున్నాడు. మరోవైపు శర్వానంద్ ప్రాజెక్టులు పూర్తైన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కిస్తాడట. కొత్తదనం కోసం ఎప్పుడు ట్రై చేసే శర్వానంద్ చేసే మరో ప్రయోగం ఆయనకు ఎంతవరకు విజయాన్ని అందిస్తుందో చూడాలి.