Begin typing your search above and press return to search.

లీక్ రాయుళ్ల‌కు శంక‌ర్ - దిల్ రాజు వార్నింగ్

By:  Tupaki Desk   |   16 Feb 2022 7:32 AM GMT
లీక్ రాయుళ్ల‌కు శంక‌ర్ - దిల్ రాజు వార్నింగ్
X
స్టార్ హీరో సినిమాల‌కు ఈ మ‌ధ్య లీకుల భ‌యం ప‌ట్టుకుంది. ఇన్ డోర్ అవుట్ డోర్ .. ఇలా ఎక్క‌డా షూటింగ్ చేస్తున్నా దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు క్ష‌ణాల్లో బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాయి. టీమ్‌కి లొకేష‌న్ లో మొబైల్ ఫొన్ లు వాడొద్ద‌ని స్ట్రిక్ట్ గా నిబంధ‌న‌లు పెడుతున్నా లీకుల్ని మాత్రం ఆప‌లేక‌పోతున్నారు. `ఆర్ ఆర్ ఆర్‌` మూవీకి కూడా లీకులు త‌ల‌నొప్పిగా మారిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ పులి ఫైట్ కి సంబంధించిన ఫొటోలు, రామ్ చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారి డ్రెస్ లో వున్న ఫొటోలు నెట్టింట లీక్ కావ‌డం రాజ‌మౌళిని ఇబ్బందికి గురిచేశాయి.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` మూవీకి సంబంధించిన ఆన్ లొకేష‌న్ స్టిల్స్ కూడా బ‌య‌టికి లీక్ కావ‌డంతో లీక్ అయిన స్టిల్ వైర‌ల్ కావ‌డంతో అదే స్టిల్‌ని టైటిల్ కి వాడేసుకున్నారు. ఇక ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలోని `క‌ళావతి లిరిక‌ల్ వీడియో మొత్తం రిలీజ్ డేట్ కి ముందే లీక్ కావ‌డం చిత్ర బృందాన్ని షాక్ కు గురిచేసింది. ఇలా వ‌రుస లీకులు ఇబ్బందిక‌రంగా మార‌డంతో టాలీవుడ్ నిర్మాత‌లు లీకు రాయుళ్ల ప‌ట్ల సీరియ‌స్ గా వ్య‌వ‌హ‌రించ‌డానికి రెడీ అవుతున్నారు.

ఇందులో భాగంగా శంక‌ర్ - దిల్ రాజు లీకు రాయుళ్ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ది గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప్ర‌స్తుతం రాజ‌మండ్రి ప‌రిస‌రాల్లో జ‌రుగుతోంది. ఈ మూవీకి సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని బ‌హిరంగ ప్ర‌దేశాల్లో జ‌న‌సంద్రం అధికంగా వుండే ప్రాంతాల్లో చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా లీకులు అధికంగా వుండే అవ‌కాశం వుంద‌ని గ్ర‌హించిన శంక‌ర్ - దిల్ రాజు లీకు రాయుళ్ల‌కు ఈ సంద‌ర్భంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ సోష‌ల్‌ మీడియా ట్విట్టర్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశారు. `#RC15 #SVC50 చిత్రీక‌ర‌ణ సినిమా అవ‌స‌రాల‌కు అనుగుణంగా బహిరంగ‌ప్ర‌దేశాల్లో జ‌న‌సందోహంతో జ‌రుగుతోంది.

ప్ర‌తీ ఒక్క‌రూ సంయ‌మ‌నం పాటించాల‌ని, చ‌ట్ట‌విరుద్ధంగా తీసిన షూటింగ్ చిత్రాలు, వీడియోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేయ‌కుండా వుండాల‌ని మేము అభ్య‌ర్థిస్తున్నాము. అన‌ధికారిక కంటెంట్ ను పోస్ట్ చేసే ఐడీల‌పై మా యాంటీ పైర‌సీ టీమ్ చ‌ర్య తీసుకుంటుంది` అంటూ రిక్వెస్ట్ చేస్తూనే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దీంతో లీకు రాయుళ్ల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. శంక‌ర్ సినిమా అంటే సెట్ లో చాలా నిబంధ‌న‌లు వుంటుంటాయి. ఆయ‌న సినిమాకు సంబంధించిన ఏ ఒక్క ఫొటో అయినా బ‌య‌ట‌కి వ‌చ్చేది కాదు. అలాంటి శంక‌ర్ కు కూడా 2.0 విష‌యంలో లీకుల బెడ‌ద ఎదురైంది. అయితే ఆ అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని రామ్ చ‌ర‌ణ్ చిత్రానికి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. యాంటీ పైర‌సీ టీమ్ భ‌యంతో అయినా లీకు రాయుళ్లు సైలెంట్ అవుతారేమో చూడాలి. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ఓ పాత్ర‌లో పొలిటిక‌ల్ లీడ‌ర్ గానూ.. మ‌రో పాత్ర‌లో పవ‌ర్ ఫుల్ ప్ర‌భుత్వ ఉద్యోగిగా క‌నిపించ‌బోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.