Begin typing your search above and press return to search.

ఏజ్ తో పాటే రిస్క్ కూడా పెరిగిందే

By:  Tupaki Desk   |   9 Nov 2017 5:02 AM GMT
ఏజ్ తో పాటే రిస్క్ కూడా పెరిగిందే
X

ప్రస్తుతం టాలీవుడ్ లో 50+ హీరోలు చాలా మందే ఉన్నారు. చిరంజీవి.. బాలకృష్ణ.. నాగార్జున.. వెంకటేష్.. రాజశేఖర్.. రవితేజలు తమ ఏజ్ 50 దాటినా ఇంకా హీరోలుగా అలరిస్తూనే ఉన్నారు. అయితే.. ఈ హీరోలు తమ సినిమాల్లోని యాక్షన్ సన్నివేశాల కోసం.. డూప్ లను ఉపయోగించేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు. రిస్కీ స్టంట్స్ ను కూడా తామే చేసేస్తున్నారు. అటు మేకర్స్ ఈ విషయంలో కంగారు పడుతున్నా.. ఫ్యాన్స్ ను థ్రిల్ చేయడానికి రిస్క్ లను ఫేస్ చేసేస్తున్నారు.

విచిత్రమైన విషయం ఏంటంటే.. వీరిలో చాలామంది తాము యంగ్ ఏజ్ లో ఉన్నపుడు బాడీ డబుల్స్ ను ఉపయోగించిన వారే. కానీ వయసు పైబడ్డ కొద్దీ.. రిస్క్ లను కూడా పెంచుకుంటున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన పీఎస్వీ గరుడవేగకు ఎంతటి హిట్ టాక్ వచ్చిందో తెలిసిందే. ప్రవీణ్ సత్తారు స్టోరీ లైన్ చెప్పినపుడే తాను ఈ సినిమాలోని స్టంట్స్ సొంతగా చేయాలని ఫిక్స్ అయినట్లు చెబుతున్నాడు రాజశేఖర్.

మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా రిస్క్ ను ఫేస్ చేసేందుకు తెగ ఉత్సాహం చూపుతారు. లెజెండ్ మూవీలో గ్లాస్ ను బ్రేక్ చేసుకుంటూ గుర్రంపై వెళ్లే సీన్ ను.. వేలాది మంది ఫ్యాన్స్ సాక్షిగా.. వైజాగ్ బీచ్ రోడ్ లో స్వయంగా చేశారు బాలయ్య. ఇంటి నుంచి బయల్దేరినపుడు ఎలాంటి రిస్క్ లు చేయనని ప్రామిస్ చేసి వస్తానని.. కానీ షూటింగ్ స్పాట్ కు వచ్చిన తర్వాత.. ఒట్టు తీసి పక్కన పెట్టేసి తన పని తాను చేసుకుపోతానని చెబుతున్నారు బాలకృష్ణ.

యాభై ఏళ్లు పైబడిన తర్వాత రిస్క్ లను ఫేస్ చేయాలని నిర్ణయించుకోవడం వెనక చాలానే కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆడియన్స్ బాగా పరిశీలిస్తున్నారు. బాడీ డబుల్ ను కానీ.. గ్రాఫిక్స్ ను కానీ ఉపయోగిస్తే ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఏదైనా సన్నివేశం డూప్ అని అర్ధమైతే.. ఇక సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రాలింగ్ మామూలుగా ఉండడం లేదు. వీరికి భయపడి రిస్కులు చేస్తున్నారని కాదు కానీ.. తమ ఫ్యాన్స్ ను ఎంటర్టెయిన్ చేసేందుకు బాగానే కష్టపడుతున్నారు.

మరోవైపు గతంతో పోల్చితే ఇప్పుడు భద్రతా ప్రమాణాలు పెరిగాయి. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ అన్నిటినీ ముందుగానే ఏర్పాటు చేసుకుంటున్నారు. అది కూడా సీనియర్లు రిస్క్ చేసేందుకు పురిగొల్పుతోంది.