Begin typing your search above and press return to search.

అఖిల్ దెబ్బ తర్వాత ఎలా అయ్యిందంటే..

By:  Tupaki Desk   |   16 Jun 2016 4:26 PM IST
అఖిల్ దెబ్బ తర్వాత ఎలా అయ్యిందంటే..
X
తెలుగులో ఏ డెబ్యూ హీరోకూ లేనంత హంగామా నడిచింది అక్కినేని అఖిల్ విషయంలో. అతడి తొలి సినిమా ‘అఖిల్’కు హైప్ మామూలుగా లేదు. ఈ హడావుడి చూసే ముంబయి భామ సాయేషా సైగల్ తన అరంగేట్రం కోసం టాలీవుడ్ నే ఎంచుకుంది. ‘అఖిల్’ సినిమాకు సంతకం చేసింది. ఐతే ఈ అమ్మాయికి ప్రమోషన్లలో ఎక్కడా అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు కనిపించలేదు. తర్వాత సినిమాకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. అసలే సినిమా డిజాస్టర్ అంటే.. సాయేషా లుక్స్.. ఆమె పెర్ఫామెన్స్ మీద విమర్శలు కూడా వచ్చాయి. దెబ్బకు టాలీవుడ్లో నుంచి ముంబయికి తుర్రుమంది సాయేషా.

తెలుగులో యువ కథానాయకుడితో నటించిన సాయేషా.. హిందీలో మాత్రం ఓ సీనియర్ హీరోకు జోడీగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘శివాయ్’తో సాయేషా హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. ఇప్పటికే అజయ్ దేవగన్ కు సంబంధించిన లుక్స్ ఆసక్తి రేకెత్తించాయి. తాజాగా సాయేషా లుక్ కూడా పరిచయం చేశారు. అమ్మడి లుక్ ఆసక్తికరంగానే అనిపిస్తోంది. దాదాపు పాతికేళ్లుగా హీరోగా నటిస్తున్న అజయ్ దేవగన్ ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి దర్శకత్వం వహిస్తూ ఓ సినిమాను నిర్మించడానికి కూడా ముందుకు రావడం విశేషమే. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.