Begin typing your search above and press return to search.

అవ‌న్నీ రూమ‌ర్లే.. క్లారిటీ ఇచ్చిన‌ స్టార్ ప్రొడ్యూస‌ర్?

By:  Tupaki Desk   |   18 Jun 2022 10:30 AM GMT
అవ‌న్నీ రూమ‌ర్లే.. క్లారిటీ ఇచ్చిన‌ స్టార్ ప్రొడ్యూస‌ర్?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న క్రేజ్ కి త‌గ్గ‌ట్టుగా 'బాహుబ‌లి' త‌రువాత అదే స్థాయి బ‌డ్జెట్ సినిమాల్లో న‌టిస్తున్నారు. ప్రేక్ష‌కులు కూడా ప్ర‌భాస్ నుంచి ఇదే త‌ర‌హా సినిమాల్ని ఆశిస్తుండ‌టంతో బ్యాక్ టు బ్యాక్ భారీ పాన్ ఇండియా మూవీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌భాస్ అందులో ఇప్ప‌టికే ఓ మూవీ షూటింగ్ ని రాకెట్ వేగంతో పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

ప్ర‌భాస్ న‌టించిన తొలి మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్‌'. రామాయ‌ణ గాథ ఆథారంగా ఓ జ‌ప‌నీస్ మూవీ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాంగంగా వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ ఒకే సారి రెండు చిత్రాల‌ని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో 'సలార్‌'తో పాటు 'మ‌హాన‌టి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో 'ప్రాజెక్ట్ కె'లో న‌టిస్తున్నారు.

'ఆదిత్య 369' త‌ర‌హా టైమ్ ట్రావెల్ మూవీగా సైన్స్ ఫిక్ష‌న్ గా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ ని ఈ మూవీకి కేటాయించ‌డం విశేషం. బాలీవుడ్ క్రేజీ లేడీ దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టిస్తోంది.

అంతే కాకుండా కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ క‌నిపించ‌బోతున్నారు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు మెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీ షూటింగ్ గ‌త కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో జ‌రుగుతోంది.

అయితే ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న దీపిక ఇటీవ‌ల ఉన్న‌ట్టుండి బ్ల‌డ్ ప్రెష‌ర్ లో స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఎల్బీ న‌గ‌ర్ లోని కామినేని హాస్పిట‌ల్ కు ఆమెని త‌ర‌లించారు. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఘ‌ట్టాలలో దీపిక పాల్గొంటున్న నేప‌థ్యంలో ఆమెకు అక‌స్మాత్తుగా ఇబ్బంది త‌లెత్తింద‌ని, ఆ కార‌ణంగానే ఆమె హాస్పిట‌ల్ లో జాయిన్ అయ్యార‌ని వార్త‌లు వినిపించాయి. ఆ త‌రువాత ప్ర‌భాస్ కూడా ముంబైలో ప్ర‌త్య‌క్షం కావ‌డంతో ఈ మూవీ షూటింగ్ కు దీపిక కార‌ణంగా బ్రేకిచ్చారంటూ వార్త‌లు మొద‌ల‌య్యాయి.

అయితే తాజాగా ఈ వార్త‌ల‌పై నిర్మాత సి. అశ్వ‌నీద‌త్ క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్ట్ కె షూటింగ్ ఆగిందంటూ వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని, అయితే ఈ షూటింగ్ లో ప్ర‌భాస్ కు సంబంధించిన స‌న్నివేశాలు లేవ‌ని, దీపిక‌, అమితాబ్ పైనే ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుగుతోంద‌ని అశ్వ‌నీద‌త్ క్లారిటీ ఇచ్చిన‌ట్టుగా తెలిసింది.