Begin typing your search above and press return to search.

సరిలేరు టీజర్.. ప్రకాష్ రాజ్ మార్క్ డైలాగ్

By:  Tupaki Desk   |   22 Nov 2019 6:41 AM GMT
సరిలేరు టీజర్.. ప్రకాష్ రాజ్ మార్క్ డైలాగ్
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. సాధారణంగానే మహేష్ బాబు సినిమాకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాకు వరస హిట్లతో జోరుమీద ఉన్న అనిల్ రావిపూడి దర్శకుడు కావడం.. పైగా ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవడంతో ఈ టీజర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు.. ప్రకాష్ రాజ్ కలిసి నటించిన చిత్రాలలో చాలావరకూ సూపర్ డూపర్ హిట్లే. ప్రకాష్ రాజ్ విలనిజం.. మహేష్ హీరోయిజం పోటీ పీక్స్ లో ఉంటుంది. మరి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నారా లేదా అనే విషయం పక్కన పెడితే టీజర్ లో ప్రకాష్ రాజ్ పాత్ర చెప్పే ఒక పంచ్ డైలాగ్ హైలైట్ గా నిలుస్తుందట. మహేష్ ను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ "సంక్రాంతికి అల్లుడు వచ్చాడు అనుకుంటే.. మొగుడు వచ్చాడు ఏంటి?" అంటూ నిట్టూరుస్తాడట. ఈ డైలాగ్ టీజర్ చివర్లో వస్తుందని సమాచారం. ఈ డైలాగ్ జస్ట్ సినిమా కథకు సంబంధించింది అన్నట్టు కాకుండా సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోటీని ఉద్దేశించి కూడా పరోక్షంగా పంచ్ అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. విజయశాంతి.. ఆది పినిశెట్టి.. హరితేజ.. రాజేంద్ర ప్రసాద్.. సుబ్బరాజు.. వెన్నెల కిషోర్..అనసూయ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.