Begin typing your search above and press return to search.

తగ్గేది లేదంటున్న సూపర్ స్టార్.. 10 వ తేదీ కి ఫిక్స్!

By:  Tupaki Desk   |   1 Jan 2020 6:48 AM GMT
తగ్గేది లేదంటున్న సూపర్ స్టార్.. 10 వ తేదీ కి ఫిక్స్!
X
టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి బిగ్గెస్ట్ సీజన్. అది అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో సాధారణ సినిమాలకు విడుదలయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ పైకి సాధారణ సినిమాలా కనిపించినా ఆ సినిమాకు కూడా బ్యాకప్ తప్పని సరిగా ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి పోటీ భారీగా ఉంది. అయితే ఈ సక్రాంతి పోటీ మాత్రం ఒక థ్రిల్లర్ సినిమా ట్విస్టులను తలపించేలా ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' మధ్య పోటీ హద్దులు దాటిపోయింది.

ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఈ రెండే. మొదటి నుంచి ఈ రెండు సినిమాలకు రిలీజ్ విషయంలో తకరారు నడుస్తోంది. ఎవరు ఎప్పుడు రావాలి అనే విషయంలో ఆరంభంలోనే కిందామీద పడ్డారు. మొదట అల్లు అర్జున్ టీమ్ 'అల వైకుంఠపురములో' సినిమా ను జనవరి 12 న విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ టీమ్ కూడా కొన్ని గంటల వ్యవధిలో అదే డేట్ ప్రకటించారు. తాము వెనక వస్తామని మీరు ముందు సినిమాను రిలీజ్ చేసుకోవాలని 'అల వైకుంఠపురములో' టీమ్ కోరిందని అయితే మహేష్ టీమ్ రెండు రోజుల గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేసుకోవాలని అన్నారని టాక్ వినిపించింది. అయితే ఈ ప్రతిపాదనకు సమ్మతించని అల్లు అర్జున్ టీమ్ 12 తేదీ తమ చిత్రం రిలీజ్ చేస్తారని ప్రకటించారని అప్పట్లో ప్రచారం సాగింది. దీంతో అప్సెట్ అయిన మహేష్ టీమ్ 12 నే తమ సినిమా కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు.

అయితే రెండుసినిమాలు ఒకే రోజు విడుదలైతే బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోతారనే ఉద్దేశం తో కొందరు ఇండస్ట్రీ పెద్దలు మహేష్ టీమ్ కు నచ్చజెప్పి 11 వ తేదీకి 'సరిలేరు నీకెవ్వరు' డేట్ ను మార్చుకునేలా ఒప్పించారట. దీంతో అప్పటికి సమస్య పరిష్కారం అయింది. 11 న మహేష్ సినిమా.. ఒక్క రోజు తర్వాత 12 న అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయ్యేలా డీల్ సెట్ అయింది. అయితే థ్రిల్లర్ సినిమాలో ట్విస్ట్ లాగా ఆ సీన్ మొత్తం ఇప్పుడు మారిపోయింది.

'అల వైకుంఠపురములో' సినిమాను జనవరి 10 వ తారీఖునే విడుదల చేస్తామని అల్లు అర్జున్ టీమ్ ప్రకటించడం తో ఇప్పుడు ఒక్కసారిగా సంక్రాంతి పోటీ వేడెక్కింది. గొడవ అంతా సమసిపోయిన తర్వాత ఇలా మాట తప్పడం ఏంటి అని మహేష్ అప్సెట్ అయ్యారని.. అదే డేట్ కు తమ సినిమాను కూడా రిలీజ్ చేయాలని తమ నిర్మాతకు తెగేసి చెప్పారని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు చెప్పారు కాబట్టి వారిమీద గౌరవం తో తమ సినిమా డేట్ మార్చుకున్నామని.. ఇప్పుడు మళ్ళీ డేట్స్ మార్చుకుంటామంటే ఊరుకునేది లేదని మహేష్ కరాఖండిగా చెప్పారట. ఈ విషయం 'అల వైకుంఠపురము లో' నిర్మాతలకు కూడా స్పష్టం గా చెప్పాలని మహేష్ సూచించారట. మరి ఈ రిలీజ్ డేట్ గొడవ ఎంత వరకూ వెళ్తుంది.. నిజంగానే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా అనేది వేచి చూడాలి.