Begin typing your search above and press return to search.

'పుష్ప 2' లో సమంత..? సుక్కూ అలాంటి ప్లాన్ చేస్తున్నాడా..?

By:  Tupaki Desk   |   3 Aug 2022 2:30 AM GMT
పుష్ప 2 లో సమంత..? సుక్కూ అలాంటి ప్లాన్ చేస్తున్నాడా..?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ''పుష్ప: ది రైజ్''. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించారు. ఈ యాక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అన్ని భాషల్లోనూ 'పుష్ప' పార్ట్-1 మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం నమోదు చేసింది. పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే వంటి పలు డైలాగ్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉన్నాయంటే.. పుష్ప మ్యానియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

'పుష్ప 1' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రెండో భాగం 'పుష్ప: ది రూల్' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు అందరూ సెకండ్ పార్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సుక్కూ అండ్ టీమ్ ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

మొదటి భాగాన్ని మించి భారీ స్థాయిలో రెండో భాగాన్ని తీర్చిదిద్దాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ ఈ స్క్రిప్ట్స్ ను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యాక్షన్ - ఎలివేషన్ సీన్స్ మరియ ఎమోషన్స్ ఈ భాగంలో హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని టాక్.

ఇందులో భాగంగా 'పుష్ప 1' లో మిగిలిన పాత్రలను కొనసాగిస్తూనే.. మరికొంతమంది స్టార్ కాస్ట్ ను భాగం చేయనున్నారని తెలుస్తోంది. రష్మిక మందన్నా శ్రీవల్లి పాత్రతో పాటుగా భన్వర్ లాల్ షెకావత్ - మంగళ శీను - దాక్షాయని పాత్రలు కంటిన్యూ అవ్వనున్నాయి. కొత్తగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా జాయిన్ అవుతాడని టాక్ నడుస్తోంది.

అయితే లేటెస్టుగా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం 'పుష్ప 2' లో సమంత రూత్ ప్రభు కూడా కొనసాగవచ్చని అంటున్నారు. పార్ట్-1 లో 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' అనే ఐటమ్ సాంగ్ లో సామ్ ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఒక్క పాటతో నేషనల్ వైడ్ ఊపేసిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు 'పుష్ప: ది రూల్' సినిమాలోనూ సమంత పాత్రను కొనసాగించాలని సుకుమార్ తన బృందంతో చర్చలు జరుగుతున్నారట. పుష్పరాజ్ కి సహాయం చేసే స్నేహితురాలిలా ఆమె పాత్రను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

అంతేకాదు పుష్పరాజ్ భార్య అయిన శ్రీవల్లి సినిమా ప్రారంభమైన మొదటి 20 నిమిషాల్లో చనిపోతుందట. కాకపోతే పుష్ప ఇన్నర్ మైండ్ గా ఆమె క్యారక్టర్ చివరి వరకూ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోనే సామ్ పాత్రను ఇన్వాల్స్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

ఇకపోతే సుకుమార్ ఫ్రెంచ్ సినిమాలు మరియు లాటిన్ అమెరికన్ సినిమాలన్నింటినీ రిఫరెన్స్ గా తీసుకొని 'పుష్ప 2' స్క్రిప్ట్ ను రాస్తున్నాడని టాక్ నడుస్తోంది. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్పరాజ్.. ఎర్ర చందనం స్మగ్లింగ్ సిండికేట్ ను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది 'పుష్ప: ది రైజ్' లో చూపించారు. ఇప్పుడు రెండో భాగంలో శత్రువులను ఎదుర్కొని ఎలా రూల్ చేసాడనేది చూపించబోతున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోని ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం తాత్కలికంగా షూటింగ్స్ బంద్ చేసిన నేపథ్యంలో.. సమ్మె ముగిసిన తర్వాత 'పుష్ప 2' రెగ్యూలర్ షూటింగ్ పై క్లారిటీ రానుంది.