Begin typing your search above and press return to search.

అప్పుడు అదృశ్యమైపోయిన పిల్ల ఇప్పుడిలా ఊడిపడింది!

By:  Tupaki Desk   |   5 March 2021 11:30 PM GMT
అప్పుడు అదృశ్యమైపోయిన పిల్ల ఇప్పుడిలా ఊడిపడింది!
X
సయామీ ఖేర్ .. ఈ పేరు ప్రస్తావించగానే ఎక్కడో విన్నట్టుందే అనిపిస్తుంది కదూ. విన్నట్టే కాదు .. చూసినట్టుగా కూడా అనిపిస్తుంది. అవును ఈ పిల్లను చూశారు .. 'రేయ్' సినిమాలో. సాయిధరమ్ తేజ్ చేసిన తొలి సినిమా ఇదే. అయితే కొన్ని కారణాల వలన ముందుగా 'పిల్లా నువ్వులేని జీవితం' థియేటర్లకు వచ్చింది. వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన 'రేయ్' మూవీ, 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో ఆయన సరసన ఒక నాయికగా సయామీ ఖేర్ అలరించింది.

తెరపై ఈ పిల్లను చూసినవాళ్లు మెరుపుతీగలా .. చెరుకుముక్కలా ఉందనుకున్నారు. ఈ సుందరి జోరు .. హుషారు చూసిన కుర్రాళ్లు, శుభం కార్డు పడేలోగానే అభిమానులుగా మారిపోయారు. మళ్లీ ఈ చిన్నదాని సినిమా వస్తే మొదటి షోనే చూడాలని కంకణాలు కూడా కట్టుకున్నారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో దర్శక నిర్మాతలెవరూ కూడా ఈ అమ్మాయిని పట్టించుకోలేదు. దాంతో సహజంగానే ఈ బ్యూటీ టాలీవుడ్ కి దూరమైపోయింది. అలా 6 సంవత్సరాల క్రితం అదృశ్యమైపోయిన ఈ పిల్ల, మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు ప్రత్యక్షమైంది. అదే నాగార్జున సినిమా 'వైల్డ్ డాగ్'లో.

నాగార్జున కథానాయకుడిగా అహిషోర్ సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా నిర్మితమైన ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఒక కథానాయికగా దియా మీర్జా నటించగా, మరో కథానాయికగా సయామీ ఖేర్ ఆకట్టుకోనుంది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. అతుల్ కులకర్ణి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. చాలా గ్యాప్ తరువాత సయామీ ఖేర్ చేస్తున ఈ సినిమా, ఇక్కడ ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.