Begin typing your search above and press return to search.

రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు

By:  Tupaki Desk   |   10 Sep 2021 4:41 PM GMT
రోడ్డు ప్రమాదంలో హీరో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలు
X
ప్రముఖ సినీ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది.

మాదాపూర్ లోని కేబుల్ బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. అనంతరం స్థానికులు, పోలీసులు ఆయనను మాదాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

సినీ హీరో సాయిధరమ్ వినాయక చవితి కావడంతో స్పోర్ట్స్ బైక్ పై రైడింగ్ కు వెళ్లినట్లు తెలిసింది. ఈక్రమంలోనే తీగల బ్రిడ్జిపై ఆయన కిందపడ్డారు. ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జి దాటాక కోహినూర్ హోటల్ వద్ద సాయిధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ నుంచి ఒక్కసారిగా కిందపడ్డారు.

అక్కడ గుర్తించిన స్థానికులు, పోలీసులు సాయిధరమ్ ను వెంటనే మాదాపూర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన కుడికన్ను, చాతి, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై స్థానిక సీఐ స్పందించారు. సాయిధరమ్ కుటుంబ సభ్యులకు ప్రమాదంపై చెప్పామని.. స్కానింగ్ కోసం సాయిధరమ్ ను పంపామని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిసిందని సీఐ తెలిపారు.

అయితే ప్రస్తుతం వైద్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితి నుంచి కోలుకున్నాడని.. మెలకువలోకి వచ్చినట్టు సమాచారం. ఆయనకు ప్రమాదం ఏమీ లేదని.. ప్రాణాపాయం లేదని తెలిసింది. సాయిధరమ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు ‘తుపాకీ.కామ్’ కోరుతున్నారు.