Begin typing your search above and press return to search.

'సాహో'కు బాలీవుడ్‌ లో కష్టమే

By:  Tupaki Desk   |   14 Jun 2019 5:15 AM GMT
సాహోకు బాలీవుడ్‌ లో కష్టమే
X
బాహుబలి స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న 'సాహో' చిత్రం కోసం ఫ్యాన్స్‌ దాదాపు సంవత్సర కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో సుజీత్‌ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్‌ లు ఈ చిత్రంను రికార్డు స్థాయి బడ్జెట్‌ తో నిర్మించారు. హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ తో ఈ చిత్రంను దర్శకుడు సుజీత్‌ తెరకెక్కించాడంటూ ప్రచారం జరిగింది. టీజర్‌ విడుదల తర్వాత ఆ విషయం నిజమే అన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.

సాహో టీజర్‌ కు వచ్చిన రెస్పాన్స్‌ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ చిత్రంకు ఎంతటి ఆసక్తి ఉందో తేలిపోయింది. టీజర్‌ విడుదలైన ఆరు గంటల్లోనే ఏకంగా 25 మిలియన్‌ ల వ్యూస్‌ ను రాబట్టింది. సాహో టీజర్‌ కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా ఈ చిత్రంపై ఆసక్తిగా ఉన్నారని తేలిపోయింది. అయితే సినిమా బాలీవుడ్‌ లో ఏ స్థాయి వసూళ్లను రాబట్టగలదనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

సినిమాకున్న క్రేజ్‌ నేపథ్యంలో బాలీవుడ్‌ రైట్స్‌ భారీ మొత్తంకు అమ్ముడు పోయాయి. కాని సాహో చిత్రంకు పోటీగా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న మిషన్‌ మంగళ్‌ విడుదల కాబోతుంది. బాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ హీరో అయిన అక్షయ్‌ కుమార్‌ మూవీతో పోటీ పడటం అంటే మామూలు విషయం కాదు. పలువురు బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు కూడా గతంలో అక్షయ్‌ తో పోటీ పడి చతికిల పడిపోయారు. ఇప్పుడు సాహోతో ప్రభాస్‌ ఏ స్థాయిలో అక్షయ్‌ ని ఢీ కొట్టగలడనేది అనుమానమే.

అక్షయ్‌ పోటీ లేకుండా సోలో రిలీజ్‌ అయితే సాహో చిత్రం భారీ ఓపెనింగ్స్‌ రాబట్టడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాహోకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాని బాలీవుడ్‌ కు వచ్చేప్పటికి అక్షయ్‌ భయపెడుతున్నాడు.