Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తున్న ప్రొఫెషనల్ బాక్సర్స్...!

By:  Tupaki Desk   |   6 May 2020 9:50 AM GMT
ఆర్.ఆర్.ఆర్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తున్న ప్రొఫెషనల్ బాక్సర్స్...!
X
దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల్లో పోరాట సన్నివేశాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా 'స్టూడెంట్ నెం.1' నుండి ‘సింహాద్రి’ 'సై' ‘విక్రమార్కుడు’ ‘మగధీర’ ‘బాహుబలి’ ఇలా ప్రతీ సినిమాలో అదిరిపోయే పోరాట సన్నివేశాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసాడు. తన సినిమాల్లో అంత అద్భుతంగా పోరాట దృశ్యాల్ని చెక్కుతాడు జక్కన్న. ఆయన ప్రతీ సినిమా విజయంలో ఫైట్స్ కూడా ముఖ్య పాత్ర పోషించాయి. చరణ్ తో రాజమౌళి రూపొందించిన 'మగధీర' సినిమాలో యాక్షన్ పార్ట్ ఎలా ఉందో అందరికి తెలిసిందే. అలానే ‘బాహుబలి’ అఖండ విజయంలో ఈ ఫైట్స్ పాత్ర చాలానే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఫైట్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు 'కొమరం భీమ్' - 'అల్లూరి సీతారామరాజు' పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సీతారామరాజు - కొమరం భీమ్‌ ల కోసం బాక్సింగ్ పంచులు వాడుతున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకం గా తెరకెక్కుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ప్రొఫెషనల్ బాక్సర్లు ఫైట్ సీక్వెన్స్‌ కు కొరియోగ్రాఫ్ చేస్తున్నారట.

భారత ప్రొఫెషనల్ బాక్సర్ కుల్దీప్ సింగ్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘రాజమౌళితో కలిసి పనిచేయడం గర్వంగా భావిస్తున్నా… రామ్ చరణ్, అజయ్ దేవగణ్, ఎన్టీఆర్, అలియా భట్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కోసం కొన్ని బాక్సింగ్ సీన్స్‌ కు కొరియోగ్రఫీ చేశాను. ఇది కూడా బాహుబలిలా మరో బ్లాక్‌ బస్టర్ అవుతుంది’ అంటూ కుల్దీప్ సింగ్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే  విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్‌ లో చరణ్ బాక్సింగ్ స్టిల్స్‌ ను చూపించాడు రాజమౌళి. విల్లువిద్య - షూటింగ్ - బాక్సింగ్ విద్యల్లో ఆరితేరిన సీతారామరాజు కోసం ఓ అదిరిపోయే బాక్సింగ్ ఫైట్ కంపోజ్ చేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. హాలీవుడ్ సినిమాలను తలపించే రేంజ్‌ లో ఫైట్స్‌ ను రూపొందించే రాజమౌళి.. ‘ఆర్.ఆర్.ఆర్’తో మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తున్నారు.

రామ్ చరణ్ బర్త్‌ డేకి ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ టీమ్.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజున ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియో రిలీజ్ చేయనుంది. మొత్తానికి ఈ న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను బాగా ఉత్సాహపరుస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.