Begin typing your search above and press return to search.

ఆఫ్‌ లైన్ ప్రమోషన్స్ కు దూరంగా 'రౌడీ బాయ్స్'..?

By:  Tupaki Desk   |   7 Jan 2022 12:30 PM GMT
ఆఫ్‌ లైన్ ప్రమోషన్స్ కు దూరంగా రౌడీ బాయ్స్..?
X
అగ్ర నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ ను ''రౌడీ బాయ్స్'' సినిమాతో హీరోగా లాంచ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

నిజానికి ఈ ఫెస్టివల్ సీజన్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ముందుగా ప్రకటించలేదు. కరోనా మరియు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దెబ్బకు టాలీవుడ్ లో సంక్రాంతి సినిమాల విడుదలలు పూర్తిగా మారిపోవడంతో.. అప్పటికప్పుడు సంక్రాంతికి రావాలని డిసైడ్ అయ్యారు. 'ఆర్.ఆర్.ఆర్' 'రాధే శ్యామ్' వంటి పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేయగా.. పరిస్థితుల ప్రభావం వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు 'రౌడీ బాయ్స్' తోపాటుగా 'బంగార్రాజు' 'డీజే టిల్లు' 'హీరో' 'సూపర్ మచ్చీ' వంటి సినిమాలు రేసులోకి వచ్చి చేరాయి.

'రౌడీ బాయ్స్' సినిమాతో ఆశిష్ అరంగేట్రం కోసం దిల్ రాజు భారీ ప్లాన్స్ చేసుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ వంటి క్రేజీ హీరోయిన్ ని తీసుకోవడమే కాకుండా.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ - సినిమాటోగ్రాఫర్ మధే - ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ వంటి ప్రముఖ సాంకేతిక నిపుణులను ఈ సినిమాలో భాగం చేశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - టీజర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మంచి విడుదల తేదీ కోసం వేచి చూసిన నిర్మాతలు.. ఇప్పుడు పెద్ద పండక్కి తీసుకొస్తున్నారు.

అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా దిల్ రాజు ఆఫ్‌ లైన్ ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి బరిలో నిలిచిన 'బంగార్రాజు' విడుదల తేదీ ప్రకటించడానికి ఓ ఈవెంట్ చేసారు. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న 'హీరో' సినిమాకు సంబంధించిన ఒక కార్యక్రమం జరిగింది. కానీ 'రౌడీ బాయ్స్' సినిమా ఈవెంట్ మాత్రం జరగలేదు.

'రౌడీ బాయ్స్' సినిమా ఫస్ట్ లుక్ - మోషన్ పోస్టర్ - ఫస్ట్ సాంగ్ లను విజయ్ దేవరకొండ - సుకుమార్ వంటి సినీ ప్రముఖులను గెస్టులతో గ్రాండ్ గా ఆవిష్కరించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. సోషల్ మీడియాలో కంటెంట్‌ ను మాత్రమే వదులుతూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఆఫ్‌ లైన్ ప్రమోషన్స్ చేయకపోవడంతో దిల్ రాజు ఫ్యామిలీ హీరో లాంచింగ్ విషయంలో కూడా తెలివిగల వ్యాపారవేత్తగా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరికొందరు మాత్రం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పబ్లిక్ ఈవెంట్స్ చేయడం కరెక్ట్ కాదనే దిల్ రాజు సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రాబోయే రోజుల్లో 'రౌడీ బాయ్స్' సినిమా కోసం స్టార్ ప్రొడ్యూసర్ భారీ ప్లాన్స్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో పాటుగా చిత్ర బృందంతో మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయనున్నారని అంటున్నారు. మరి దిల్ రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న ఆశిష్.. ఫస్ట్ సినిమాతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి 'సంక్రాంతి అల్లుడు' అనిపించుకుంటారో లేదో చూడాలి.