Begin typing your search above and press return to search.

అలా.. రిచా రీ-ఎంట్రీ మొదలైంది

By:  Tupaki Desk   |   12 Jun 2015 5:30 AM GMT
అలా.. రిచా రీ-ఎంట్రీ మొదలైంది
X
నువ్వే కావాలి చిత్రంతో తెలుగుతెరకి పరిచయమైంది రిచ పల్లోడ్‌. చాక్లెట్‌బోయ్‌ తరుణ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇదే సినిమాతో రిచా తెరంగేట్రం చేయడమే కాదు తరుణ్‌తో పోటీపడి మరీ నటించింది. మనసులోని ప్రేమను చెప్పలేక, దాచుకోలేక విరహవేదన పడే అమ్మాయిగా అద్భుతంగా అభినయించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది.

అలాగే కోలీవుడ్‌లో విజయ్‌ సరసన 'షాజహాన్‌' వంటి సినిమాలో నటించినా పెద్దగా క్రేజ్‌ మాత్రం రాలేదు. అయితే ఇటీవలి కాలంలో రిచా సినిమాలకు దూరమై ఆజ్ఞాతంలో ఉండిపోయింది. దాదాపు దశాబ్ధం తర్వాత మళ్లీ కోలీవుడ్‌లో ఓ రీఎంట్రీ ఇస్తోంది. మారిన కొత్త రూపంతో ఈ సినిమాలో కనిపిస్తోంది. యాగ వారాయునుమ్‌ నా కాక్క! అనే చిత్రంలో ఆది సరసన నాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఆది సోదరుడు సత్య ప్రభాస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్య లాస్‌ ఏంజిల్స్‌ ఫిలింఇనిస్టిట్యూట్‌ దర్శకత్వ విభాగంలో శిక్షణ తీసుకుని మరీ కోలీవుడ్‌లో ప్రవేశించాడు. వస్తూనే తన ఫేవరెట్‌ నాయిక రిచాకి ఫోన్‌ చేసి ఈ అవకాశం ఇచ్చాడు.

ఇదే విషయాన్ని రిచా చెబుతూ.. ఒకానొకరోజు రాత్రి 10గంటలకు ఫోన్‌ చేశాడు. 15 నిమిషాలు మాట్లాడతానన్నాడు. రాత్రి 10 గంటలకు మొదలు పెట్టి మిడ్‌నైట్‌ ఒంటిగంట వరకూ స్క్రిప్టు చెబుతూనే ఉన్నాడు. సస్పెన్స్‌లో పెట్టి కాల్‌ కట్‌ చేశాడు. ఆ రేతిరంతా ఆ స్క్రిప్టు గురించే ఆలోచించాను. మరుసటిరోజు ఫోన్‌ చేసి 15రోజుల కాల్షీట్లు అడిగాడు. సెట్స్‌కొచ్చాక బౌండ్‌ స్క్రిప్టు చేతిలో పెట్టి చదివించాడు. పక్కా పెర్ఫెక్షనిస్ట్‌.. అంటూ ఎంతో ఉద్వేగానికి లోనైంది రిచా. తమిళంలో సరే.. మరి రిచా రీఎంట్రీ అవకాశం టాలీవుడ్‌లో ఏ దర్శకుడు ఇస్తారో చూడాలి.