Begin typing your search above and press return to search.

జైలు నుంచి ఇంటికి వచ్చాక రియా ఏం మాట్లాడిందంటే..!

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:30 PM GMT
జైలు నుంచి ఇంటికి వచ్చాక రియా ఏం మాట్లాడిందంటే..!
X
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన హీరోయిన్ రియా చక్రవర్తి బుధవారం బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్ కోణంలో రియాని ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసి విచారించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ ఆరోపణలతో 28 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపిన రియాకి బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆమె బుధవారం సాయంత్రం బైకుల్లా జైలు నుంచి బయటకు వచ్చి కారులో ఇంటికి చేరుకున్నారు. అయితే జైలు నుంచి ఇంటికి వచ్చిన వెంటనే రియా తన ఫ్యామిలీ మెంబర్స్ ని చూసి 'మీరెందుకు బాధగా ఉన్నారు?' అని అడిగిందని ఆమె తల్లి సంధ్యా చక్రవర్తి వెల్లడించారు,

రియా తల్లి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''రియా ఇంటికి రాగానే 'మా.. మీరెందుకు బాధగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం ధైర్యంగా ఉండాలి. మన ముందున్న సమస్యలను ఎదుర్కోవాలి' అని నాతో చెప్పింది'' అని పేర్కొన్నారు. ''మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ నా కూతురు భరించింది. గత కొన్ని రోజులుగా తాను పడుతున్న బాధ నుంచి రియా ఎలా బయటకు వస్తుందా అని మేమందరం ఆలోచిస్తున్నాం. నా కూతురు త్వరగానే మాములు స్థితికి వస్తుందని నాకు నమ్మకం ఉంది. కావాలంటే రియా తిరిగి నార్మల్ లైఫ్ లోకి వచ్చే విధంగా తనకి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పిస్తాను'' అని రియా తల్లి సంధ్యా చక్రవర్తి వెల్లడించారు. కాగా, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియాకి బెయిల్ మంజూరు చేసిన బాంబే హైకోర్టు.. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ పిటిషన్ ని తిరస్కరించింది. దీంతో ఇంకొన్నాళ్ళు షోవిక్ జైలులోనే ఉండనున్నాడు.