Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో రియా కు కాస్త ఊరట..!

By:  Tupaki Desk   |   11 Nov 2021 8:00 AM IST
సుశాంత్ కేసులో రియా కు కాస్త ఊరట..!
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం కేసులో ఎక్కువగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. సుశాంత్‌ ప్రియురాలిగా చెప్పబడిన రియా.. సుశాంత్ మృతికి ప్రధాన కారణమంటూ తీవ్ర అరోపణలు ఎదుర్కొంది. ఈ క్రమంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో అరెస్ట్ కాబడిన రియా.. దాదాపు నెల రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌ పై విడుదలైంది. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో భాగంగా అప్పట్లో రియా బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్‌ చేయడమే కాకుండా.. ఆమె గాడ్జెట్‌ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అయితే త‌న బ్యాంక్ ఖాతాలను ప‌ది నెల‌లుగా ఫ్రీజ్ చేశార‌ని.. దీని వ‌ల్ల త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని పేర్కొంటూ రియా చక్రవర్తి ఎన్సీబీ స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించింది. త‌న బ్యాంక్ అకౌంట్ల‌ను డీఫ్రీజ్ చేయ‌డంతో పాటుగా, విచారణ సమయంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న త‌న మొబైల్ ఫోన్ - ఐ ప్యాడ్ - ల్యాప్ టాప్ ల‌ను తిరిగి ఇప్పించాల‌ని కోర్టును కోరింది. రియా అభ్యర్థనపై ప్రత్యేక న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.

రియా చక్రవర్తి బ్యాంక్ అకౌంట్ల‌ను డీఫ్రీజ్ చేస్తూ స్పెషల్‌ ఎన్‌డీపీఎస్‌ కోర్టు తీర్పును వెలువరించింది. ఆమెకు సంబంధించిన ల్యాప్‌ టాప్ - మొబైల్ ఫోన్ మరియు ఇతర గాడ్జెట్‌ లను తిరిగి ఇవ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో రియా కు కాస్త ఊరట లభించినట్లైంది. ఇకపోతే జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన రియా.. తిరిగి సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ - ఇమ్రాన్‌ హష్మీలతో కలిసి 'చెహ్రే' అనే చిత్రంలో నటించింది.