Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు : పరారీలో రియా చక్రవర్తి...?

By:  Tupaki Desk   |   29 July 2020 5:31 PM GMT
సుశాంత్ కేసు : పరారీలో రియా చక్రవర్తి...?
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు ఇప్పుడు అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతోంది. సుశాంత్ మరణించిన బాధలో ఇన్ని రోజులుగా సైలెంటుగా ఉన్న అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు పాట్నాలోని రాజీవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో రియాతోపాటు ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురుపై ఫిర్యాదు చేసారు. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణం వెనుక రియా చక్రవర్తి హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయని.. మోసం కుట్రకు పాల్పడటం ద్వారా సుశాంత్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని.. సుశాంత్‌ ఆత్మహత్యకు సరిగ్గా 6 రోజుల ముందు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని.. తన కుమారుడికి సంబంధించిన నగదు, ఆభరణాలు, ల్యాప్‌ టాప్‌, క్రెడిట్‌ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు రియా వద్ద ఉన్నట్లు కేకే సింగ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 306, 340, 342, 380, 406, 420 ప్రకారం రియాతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియాకు రూ. 15 కోట్లు బదిలీ అయినట్టు గుర్తించారని వార్తలు వస్తున్నాయి. ఈ కేసు విచారణ నిమిత్తం ముంబైకి నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా పంపారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు రియాను అరెస్ట్‌ చేసే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.

కాగా ముంబై చేరుకున్న బీహార్ పోలీసుల బృందం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులతో భేటీ అయ్యారట. అనంతరం సుశాంత్ సూసైడ్ కేసు విచారణ కోసం రియా చక్రవర్తి ఇంటికి బీహార్ పోలీసుల వెళ్లగా అక్కడ ఆమె లేదని తెలుస్తోంది. అరెస్ట్ భయం కారణంగా రియా చక్రవర్తి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే సుశాంత్ కేసులో ఎఫ్.ఐ.ఆర్ నమోదైనందున రియా ను అరెస్ట్ నుంచి తప్పించేందుకు ఆమె లాయర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందస్తు బెయిల్‌ కు దరఖాస్తు చేయడం ద్వారా నేరుగా రియాను కోర్టులో హాజరుపరిచేలా లాయర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అప్పటి వరకు ఎవరికీ అందుబాటులో లేకుండా తప్పించుకు తిరగాలని రియాకి సలహా ఇచ్చి ఉంటారని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా రియా ఈ కేసు విచారణ ముంబై పోలీసులకు అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇటీవల సుశాంత్‌ కేసును సీబీఐకి అప్పగించాలని హోం మంత్రి అమిత్‌ షా కు విజ్ఞప్తి చేసిన రియా.. ఇప్పుడు కేసు ముంబై పోలీసులకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సుశాంత్‌ ఆత్మహత్య వెనక పెద్ద కుట్ర దాగి ఉందనే ప్రచారం జరుగుతోంది.