Begin typing your search above and press return to search.

ఆర్జీవీ Vs నట్టి.. అసలేం జరిగింది..?

By:  Tupaki Desk   |   21 April 2022 8:30 AM GMT
ఆర్జీవీ Vs నట్టి.. అసలేం జరిగింది..?
X
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నట్టి కుమార్ మధ్య గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాలు చేశారు. అయితే ఆర్ధిక లావాదేవీల విషయంలో ఇద్దరికీ చెడటంతో.. ఇప్పుడు ఈ ఇష్యూ కోర్టు వరకూ వెళ్ళింది. మధ్యలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. హెచ్చరించుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. లెస్బియన్ స్టోరీతో ఆర్జీవీ రూపొందించిన 'డేంజ‌ర‌స్' (మా ఇష్టం) సినిమా విడుదల నేపథ్యంలో.. దీనిపై నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. రాంగోపాల్ వర్మ తనకు రూ. 5.29 కోట్లు ఇవ్వాలని.. ప్రతి సినిమాకు రూ. 50 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం ఉండగా, దాన్ని పక్కన పెట్టి సినిమాను రిలీజ్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం తనకు డబ్బులు ఇవ్వలేదని.. అవి తిరిగిచ్చే వరకు 'మా ఇష్టం' విడుదల ఆపాలని నట్టి కుమార్ కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. సినిమా రిలీజ్ కు బ్రేకులు వేస్తూ కొన్ని రోజుల క్రితం తీర్పును వెలువరించింది. అయితే వర్మ మాత్రం థియేటర్లు ఇవ్వకపోవడంతో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ తర్వాత ఆర్జీవీ ఓ వీడియోను విడుదల చేస్తూ నట్టి కుమార్ సంగతి చూస్తానని.. కోర్టులోనే తేల్చుకుంటానంటూ వ్యాఖ్యానించారు. నట్టి కుమార్ సైతం రామ్ గోపాల్ వర్మ పెద్ద మోసగాడు అంటూ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచీ ఇది హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది.

అయితే నట్టికుమార్​ తో వివాదం నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీవీ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నట్టి కుమార్ ఫోర్జరీ డాక్యూమెంట్స్‌ తో కోర్టును మోసం చేశాడని చెబుతూ.. అతడిపై పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నారు. దీనిని ఖండిస్తూ కౌంటర్ గా నట్టి కుమార్ కూడా ధీటుగా ఓ ప్రెస్​ నోట్‌ ని రిలీజ్ చేశారు.

ఆర్జీవీ ప్రెస్ నోట్ ని పరిశీలిస్తే.. ''గత కొద్ది రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్న నట్టి కుమార్, నట్టి క్రాంతి, నట్టి కరుణ విషయం మీద ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నానని చెబుతూ ఆయన నోట్ విడుదల చేశారు. ఏప్రిల్ 8, 2022న మూడు భాషల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నా డేంజరస్ చిత్రాన్ని ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని , ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ ఆధారంగా 5వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి చిత్రాన్ని అడ్డుకున్నారు. కోర్టు ఇచ్చిన ఇంజక్షన్​ ఆర్డర్‌ ను ఇప్పుడు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది''

''నేను ఇప్పుడు నట్టి క్రాంతి - కరుణల మీద ఫోర్జరీకి సంబంధించిన కేసే కాకుండా, వివిధ మీడియా ఛానళ్లలో నాపై వేసిన నిందలు, ఆరోపణలకు సంబంధించి నట్టి క్రాంతి, కరుణల తండ్రి అయిన నట్టి కుమార్ మీద.. నేను, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు డిఫమేషన్ కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్​ కి ముందు ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్‌ ని ఉపయోగించి సినిమాని ఆపి, మాకు అపారమైన ఆర్థిక నష్టం కలిగించినందుకు డ్యామేజ్ కేసు కూడా వెయ్యబోతున్నాము"

"ఇప్పుడు విడుదల చేసేందుకు క్లియరెన్స్‌ ఆర్డర్ వచ్చింది కనుక డేంజరస్ చిత్రాన్ని మే 6న విడుదల చేయబోతున్నాము. దానికి సంబంధించి మాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్ లు కూడా పబ్లిక్ డొమైన్‌ లో పెడుతున్నాము. ఫోర్జరీ చేసి, దానిని నిజమైన డాక్యుమెంట్‌ గా ఉపయోగించడం ద్వారా నట్టి క్రాంతి, నట్టి కరుణలు చేసిన క్రిమినల్ చర్యలకి సంబంధించిన విషయాలు, అలాగే పైన పేర్కొన్న ఇంజక్షన్-ఆర్డర్‌ ను నట్టిలు సేకరించిన విధానాన్ని, యంత్రాంగాన్ని దుర్వినియోగ పరుచుకున్న తీరు.. నట్టి ఫ్యామిలీ నేరపూరిత స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రెస్​ నోట్ తప్ప, ఇకపై నేను ఈ విషయంపై ఇంకేం మాట్లాడను.. జస్ట్ వాళ్ల పైన చట్టపరమైన చర్యలపై మాత్రమే దృష్టి పెడతాను. అతి త్వరలో వాళ్ల అసలు రూపం బయటపడబోతోంది" అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.

నట్టి కుమార్ ప్రకటనలో ఏముందంటే.. ''రామ్ గోపాల్ వర్మ.. నువ్వూ నీ తాత్కాలిక మరో స్నేహితుడు రామసత్యనారాయణ ఆడుతున్న నాటకాలు ఎవరికి తెలియవు. ఎప్పటికప్పుడు కొత్తవాళ్లతో స్నేహం నటించి, వారి చేత నీ సినిమాలకు పెట్టుబడులు పెట్టించుకుని, ఆ తర్వాత మోసగించడం నీకు తెలిసినంతగా బహుశా సినీ పరిశ్రమలో ఇంకెవరికీ తెలియకపోవచ్చు. మోసపోయిన వాళ్లంతా బయటకు వచ్చి, నీ నిజస్వరూపాన్ని ఇంతవరకు బయట పెట్టకపోవడం వల్లే, ఇంకెందరో నీ చేతుల్లో మోసపోతూనే ఉన్నారు. నీ పాపాలు పండే సమయం ఆసన్నమయ్యింది. అందుకే నీకు ఈ విపరీత బుద్దులు పుట్టి, ఈ విధంగా వ్యహరిస్తున్నావు''

''మా ఇష్టం (డేంజరస్) - హిందీ 'ఖత్రా' చిత్రం విడుదలపై మేము స్టే తేవడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. అది జరిగిపోయిన ఇన్ని రోజుల వరకు మెదలకుండా ఉండి, ఇన్ని రోజుల తర్వాత ఇలాంటి ఓ నీచమైన పధకం రచించి, ఓ ప్రెస్ నోట్ తో బయటకు వచ్చిన నీ కుట్రలు ఎలాంటి వారికైనా ఇట్టే అర్ధమైపోతాయి. నీ సినిమాకు ఖర్చు లేకుండా సులువుగా పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఇలాంటి పథక రచన చేశావు. అయినా ఈ మేటర్ కోర్టు పరిధిలో ఉన్నది. నువ్వు చేసిన ఆరోపణలను ఖండించకపోతే డబ్బు విషయంలో నీ చేతిలో మోసపోయిన మమ్ములను కూడా నీ గురించి తెలియనివాళ్లు తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం ఉంది. అందుకే సూటిగా ఈ సమాధానం ఇస్తున్నాను''

''నీవు స్వయంగా ఇచ్చిన డాక్యూమెంట్స్ ను కూడా ఫోర్జరీ అంటున్నావంటే.. నీది ఎలాంటి క్రిమినల్ మెంటాలిటీనో అర్ధం చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన ఈ చెక్కులు.. నీ బ్యాంకు అకౌంట్ లు కూడా ఫోర్జరీ నే అంటావా?. ఎట్టిపరిస్థితులలో నీ నిగ్గు తేలుస్తాం. మేము కోర్టుకు వెళ్ళి ఆధారాలు పెట్టి మరీ స్టే తెచ్చాం. నువ్వు ఎలాంటి ప్రూప్స్ లేకుండానే మాకు నువ్వు స్వయంగా ఇచ్చినవే ఫోర్జరీ డాక్యూమెంట్స్ అంటున్నావు ఆంటే నీ నిజ స్వరూపం, నీ నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇట్టే చెప్పవచ్చు.''

''ఎంతో మోసగాడివైనా, నిన్ను అంత సులువుగా వదలి పెడతామని అనుకోవద్దు. తోటి నిర్మాతలను, అలాగే ఎంతోమంది పరిశ్రమలోని వారిని మోసం చేస్తున్న వర్మకు వంత పాడుతూ, ఈ పాపంలో పాలు పంచుకుంటున్న రామ సత్యనారాయణ ఈ పాపాన్ని మోస్తున్నందుకు నువ్వు అనుభవించక తప్పదు. లీగల్ గా కోర్టు ద్వారా ఈ విషయాలన్నింటిని తేల్చుకునేందుకు నేను సిద్ధంగా ఉన్నాను'' అని నట్టి కుమార్ పేర్కొన్నారు.

రామ్ గోపాల్ వర్మ - నట్టి కుమార్ ఇద్దరూ ఇలా పరస్పర ప్రెస్ నోట్స్ తో ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతమైతే ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉంది. మరి త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమై, దర్శక నిర్మాతల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.