Begin typing your search above and press return to search.

'WHO KILLED CINEMA?'.. ఆర్జీవీ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదేనా..?

By:  Tupaki Desk   |   11 Jan 2022 7:32 AM GMT
WHO KILLED CINEMA?.. ఆర్జీవీ నెక్స్ట్ సినిమా టైటిల్ ఇదేనా..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశంపై మంత్రి పేర్ని నానితో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం మీద గత కొన్ని రోజులుగా ప్రశ్నలు కురిపించిన ఆర్జీవీ.. భేటీలో కేవలం తన నిర్ణయం చెప్పడానికి మాత్రమే వచ్చానని అన్నారు. మంత్రితో చర్చలు పూర్తి సంతృప్తినిచ్చాయని పేర్కొన్న వర్మ.. పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ లను టార్గెట్ గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనేది తాను నమ్మనని చెప్పారు. అయితే సోమవారం ఏపీ ప్రభుత్వంతో ఆర్జీవీ సమావేశం సానుకూలంగా జరగలేదని ఆయన లేటెస్ట్ ట్వీట్స్ - న్యూస్ డిబేట్స్ ని బట్టి అర్థం అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ మంగళవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు. ''మహారాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR టిక్కెట్ ధరను రూ. 2200/-కి విక్రయించడానికి అనుమతించింది. అదే అతని సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో రూ. 200/-కి అమ్మడానికి కూడా అనుమతించకపోవడం 'కట్టప్పను ఎవరు చంపారు?' అనే అస్తిత్వ ప్రశ్నను లేవనెత్తుతుంది'' అని ఆర్జీవీ ట్వీట్ లో పేర్కొన్నారు.

దీనిని బట్టి చూస్తే పేర్ని నానితో దర్శకుడి భేటీ ఆశాజనకంగా జరగలేదేమో అనే సందేహాలు రేకెత్తిస్తోంది. అంతేకాదు ఆర్జీవీ సినిమా టికెట్ రేట్ల వ్యవహారాన్ని అంత ఈజీగా వదిలేలా లేడని తెలుస్తోంది. వివాదాస్పద దర్శకుడిగా పేరు పొందిన వర్మ.. ఏదొక అంశం మీద ఎవరో ఒకరిని గిల్లుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సమస్యగా భావిస్తున్న టికెట్ ధరల విషయంలో ఎంట్రీ ఇచ్చాడు.

సాధారణంగా ఏ విషయాన్ని అంత సులభంగా వదిలిపెట్టని రామ్ గోపాల్ వర్మ.. టికెట్ రేట్ల అంశం మీద ''హూ కిల్డ్ సినిమా?'' అని టైటిల్ పెట్టి సినిమా తీసినా తీస్తాడని కామెంట్స్ వస్తున్నాయి. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిసిన తర్వాత ''కట్టప్పను ఎవరు చంపారు?'' అని ఆర్జీవీ ట్వీట్ చేయడాన్ని బట్టి చూస్తే అది జరిగే అవకాశాలు ఉన్నాయని భావించవచ్చు.

వాస్తవ సంఘటన ఆధారంగా.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన అంశాల మీద.. సినీ రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కించడంలో రాంగోపాల్ వర్మ సిద్ధహస్తుడనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా టికెట్ రేట్ల ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. ఆర్జీవీ సైతం ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో కౌంటర్స్ వేస్తున్నారు. న్యూస్ ఛానెల్ డిబేట్స్ లో ఆయన అడిగే లాజికల్ ప్రశ్నలకు సమాధానాలు కూడా దొరకడం లేదు.

ఇక ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానితో భేటీ సంతృప్తికరంగా సాగిందని వర్మ చెప్పినా.. మళ్ళీ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి దేన్నైనా సినిమాగా మలిచే ఆర్జీవీ.. ఇప్పుడు టికెట్ ధరల అంశాన్ని తీసుకొని ''సినిమాని ఎవరు చంపుతున్నారు?" అనే సినిమా తీస్తారేమో చూడాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.