Begin typing your search above and press return to search.

RRR సీక్వెల్ వార్తల్లో నిజమెంత..?

By:  Tupaki Desk   |   31 Jan 2022 10:30 AM GMT
RRR సీక్వెల్ వార్తల్లో నిజమెంత..?
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా వేచి చూస్తున్నారు. అయితే ఇప్పుడు RRR చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు - కొమరం భీమ్ ల పాత్రలతో రెడీ చేసిన కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ స్టోరీ అందించారు. చరిత్రలో కలిసారో లేదో తెలియని ఈ ఇద్దరి మహావీరుల మధ్య స్నేహాన్ని.. కలిసి బ్రిటీష్ వారిపై చేసిన యుద్ధాన్ని ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు.

ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ వారి దారుల్లో స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన‌డానికి బ‌య‌ల్దేర‌డంతో 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' క‌థ ముగుస్తుందని టాక్. అయితే సీక్వెల్ లో అల్లూరి - కొమురం స్వాతంత్ర్య సంగ్రామంలో ఏం చేశార‌న్న‌ది చూపించబోతున్నారని.. అక్కడ కూడా ఇద్ద‌రూ క‌లిసిన‌ట్టు చూపించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం 'విక్రమార్కుడు' 'బజరంగీ భాయీజాన్' వంటి సినిమాలకు సీక్వెల్ కథలు సిద్ధం చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. ఈ క్రమంలో 'RRR 2' కోసం స్టోరీ రాస్తారని అంటున్నారు. అయితే ఇందులో నిజం లేకపోవచ్చు. ఎందుకంటే PVRRR లాంచింగ్ ఈవెంట్ లో రాజమౌళి స్వయంగా ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చారు.

''అవసరం కాబట్టి నేను 'బాహుబలి' కథను రెండు భాగాలుగా రూపొందించాను. 'ఆర్.ఆర్.ఆర్' కథ మొత్తం ఒకే సినిమాలోనే వస్తుంది. మార్కెటింగ్, బిజినెస్ కోసం సినిమాను రెండు మూడు భాగాలుగా తీయడంపై నాకు నమ్మకం లేదు. అది వర్కౌట్ అవ్వదు. సినిమాలు తీయడానికి ఇది నిజాయితీ లేని మార్గం. నేను ఆ విధంగా సినిమాలు తీయాలని అనుకోను'' అని రాజమౌళి చెప్పారు.

దీనిని బట్టి ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి సీక్వెల్ రాబోతోందనే వర్గాల్లో నిజం లేదనేది స్పష్టం అవుతుంది. ఇప్పటికే ఫిక్షనల్ కథతో ఈ సినిమా రూపొందించడం వల్ల రాజమౌళిచరిత్రను వక్రీకరించారంటూ.. కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు చరిత్ర ప్రకారం 1924 మే 7న మరణించిన అల్లూరి సీతారామరాజు.. 1940 వరకూ జీవించిన కొమురం భీమ్ తో కలిసి ఫ్రీడమ్ ఫైట్ చేసినట్లు చూపిస్తే చరిత్రకారులు ఒప్పుకోకపోవచ్చు. సో రాజమౌళి - విజయేంద్ర ప్రసాద్ RRR సీక్వెల్ ఆలోచన చేసే అవకాశమే లేదని చెప్పవచ్చు.

ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని ఏప్రిల్ 28న లేదా మార్చి 18న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

ఇందులో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ ఆలియా భట్ లతో పాటుగా ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రీయా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.