Begin typing your search above and press return to search.

ఇలియానాకు మ‌ళ్లీ లిఫ్టిస్తున్న మాస్ మ‌హారాజా

By:  Tupaki Desk   |   16 Aug 2021 4:53 AM GMT
ఇలియానాకు మ‌ళ్లీ లిఫ్టిస్తున్న మాస్ మ‌హారాజా
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒకేసారి రెండు మూడు సినిమాల‌ను పూర్తి చేస్తున్నారు. ఇటీవ‌ల‌ రామారావు ఆన్ డ్యూటీ కీల‌క స‌న్నివేశాల‌ను పూర్తి చేశారు. అనంత‌రం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోని ఖిలాడీ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు.

తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో ఇలియానా ఐట‌మ్ పాట‌లో న‌ర్తించ‌నుంద‌ని తెలిసింది. మేక‌ర్స్ ఇప్ప‌టికే గోవా బ్యూటీని సంప్ర‌దించారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. కిక్ - దేవుడు చేసిన మ‌నుషులు - అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని లాంటి చిత్రాలలో ర‌వితేజ‌- ఇలియానా జంట‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనితో ర‌వితేజ ఇల్లీకి మ‌రో ఛాన్స్ ఇచ్చినా ఆ సినిమా డిజాస్ట‌ర్ రిజ‌ల్ట్ నిరాశ‌ప‌రిచింది.

ఇప్పుడు మ‌రోసారి ఇలియానా తిరిగి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అది కూడా ర‌వితేజ -ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ మూవీలో ఐట‌మ్ నంబ‌ర్ తో రీఎంట్రీ ఇస్తోంది. ఇక ఇటీవ‌ల ఇలియానా కెరీర్ బాలీవుడ్ లోనూ అంతంత మాత్ర‌మే. ది బిగ్ బుల్ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు లేవు. ఆ క్ర‌మంలోనే ఇల్లీ సౌత్ వైపు చూస్తోంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తెలుగు-త‌మిళ నిర్మాత‌ల‌కు ఇటీవ‌ల మ‌ళ్లీ ట‌చ్ లోకి వ‌చ్చింద‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అలాగే త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు హీరో రామ్ కి ఇలియానా ఇటీవ‌ల ట‌చ్ లోనే ఉన్నారు.

`దేవ‌దాస్` చిత్రంతో తెలుగులో ఆరంగేట్రం చేసిన ఇలియానా పోకిరి చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదురేలేని స్టార్ డ‌మ్ ని అందుకుంది. కానీ అనూహ్యంగా బాలీవుడ్ లో అడుగుపెట్టాక వ్య‌క్తిగ‌త జీవితంలో క‌ల‌త‌లు త‌న‌ను ఇబ్బంది పెట్టాయి. కొన్నాళ్ల డిప్రెష‌న్ అనంత‌రం దానినుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల కోసం చర్చలు జరుపుతోంది.

ర‌వితేజ ప్ర‌స్తుతం `రామారావు ఆన్ డ్యూటీ` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ ఎల్‌.ఎల్‌.పి - ఆర్‌.టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత‌. ఇది నిజఘటనల నుండి ప్రేరణ పొంది తెర‌కెక్కిస్తున్న‌ థ్రిల్లర్ మూవీ. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు. క్రాక్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ రాజాకు మ‌రో విభిన్న‌మైన యాక్ష‌న్  చిత్రంగా నిల‌వ‌నుంది.

రవితేజ కెరీర్ 68వ చిత్రమిది. ఈ చిత్రంలో చిత్తూరు జిల్లాకి చెందిన‌ ఓ ప్ర‌భుత్వ అధికారిగా ర‌వితేజ‌ క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రం టైటిల్ - ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ కాగా.. అద్భుత స్పందన ద‌క్కింది. మాఫియా లేదా ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ను ఆట క‌ట్టించే అధికారి క‌థాంశ‌మిది అంటూ ఫ‌స్ట్ లుక్ పై చ‌ర్చ సాగుతోంది. రామారావు ఆన్ డ్యూటీకి అరంగేట్ర దర్శకుడు ప‌ని చేస్తున్నా దీనికి సంబంధించిన ప్రతి ప్రకటన ఎగ్జ‌యిట్ మెంట్ ని పెంచుతోంది. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర దేనిక‌దే ప్ర‌త్యేకంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నార‌ని స‌మాచారం.

ఈ చిత్రంలో మాస్ రాజా స‌ర‌స‌న‌ ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. జెర్సీ ఫేం దివ్యాన్ష కౌశిక్ ఒక క‌థానాయిక కాగా.. మలయాళ నటి రాజీషా విజయన్ మ‌రో నాయిక‌గా క‌నిపించ‌నుంది. ఈ చిత్రంతో రాజీషా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. మూవీలో త‌న‌ పాత్ర చాలా కీలకం. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో రాజీషా విజయన్ పాల్గొంటున్నారు. రవితేజ- దివ్యాన్ష కౌశిక్ కూడా ఈ షూట్ లో పాల్గొంటున్నారని క‌థ‌నాలొచ్చాయి.