Begin typing your search above and press return to search.

చరణ్ ఆపాడు అంటున్న రత్నవేలు

By:  Tupaki Desk   |   16 Sept 2019 12:04 PM IST
చరణ్ ఆపాడు అంటున్న రత్నవేలు
X
ప్రస్తుతం సౌత్ లో ఉన్న టాప్ సినిమాటోగ్రాఫర్లలో రత్నవేలు ఒకరు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా' కు ఛాయాగ్రాహకుడు ఆయనే. ఈ సినిమాకు ముందు చరణ్ 'రంగస్థలం' చిత్రానికి పని చేశారు. అయితే 'రంగస్థలం తర్వాత రత్నవేలు డైరెక్టర్ గా మారతానని అప్పట్లో స్వయంగా చెప్పారు. కానీ 'సైరా' లాంటి మెగా ప్రాజెక్ట్ రావడంతో తన దర్శకత్వ ఆలోచనలను పక్కన పెట్టారు.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఏడేళ్ళ నుంచి దర్శకత్వం వహించాలనే ఆలోచన ఉందని తెలిపాడు. అప్పట్లో డైరెక్టర్ గా మారేందుకు రెడీ అయిన సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ తనను పిలిచి 'రోబో' కు పనిచేయాలని కోరారని.. అలాంటి అద్భుతమైన అవకాశం రావడంతో డైరెక్షన్ ఆలోచనను విరమించుకున్నానని చెప్పారు. ఆ తర్వాత కూడా అనుకోని కారణాల వల్ల సినిమాటోగ్రాఫర్ గానే కొనసాగానని తెలిపారు. 'రంగస్థలం' తర్వాత డైరెక్టర్ కావాలని డిసైడ్ అయ్యానని.. అయితే చరణ్ తనను వారించి.. 'సైరా' లాంటి మెగా ప్రాజెక్టు ఆఫర్ ఇవ్వడంతో మరోసారి డైరెక్షన్ ఆలోచన పక్కన పెట్టానని చెప్పారు. ఇండస్ట్రీకి మీలాంటి సినిమాటోగ్రాఫర్ అవసరం ఉందని.. ఇలాంటి సమయంలో దర్శకత్వం వద్దని చరణ్ తనకు నచ్చజెప్పినట్టు తెలిపారు.

ప్రస్తుతం రత్నవేలు మహేష్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కు సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తున్నారు. మరో క్రేజీ ప్రాజెక్ట్ శంకర్ - కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. అయితే ఈ సినిమాల తర్వాత అయినా దర్శకుడిగా మారాలని ఉందన్నారు. తన ఫస్ట్ సినిమాకు కథ కూడా రెడీగా ఉందట.