Begin typing your search above and press return to search.

తాలిబన్లు-జంతువులు: రాంగోపాల్ వర్మ సంచలన పోస్టు

By:  Tupaki Desk   |   17 Aug 2021 4:30 PM GMT
తాలిబన్లు-జంతువులు: రాంగోపాల్ వర్మ సంచలన పోస్టు
X
అప్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్ల దురాగతాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తమ ఆగ్రహాన్ని ఆవేశాన్ని వెళ్లగక్కుతున్నారు. అప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు అక్కడ చేస్తున్న దారుణాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి దెబ్బకు అప్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాలకు వెళుతూ విమానాల నుంచి పడిపోతూ చనిపోతున్న వైనం కలిచివేస్తోంది.

ఎప్పుడూ సంచలన విషయాలను రాజేసి హాట్ కామెంట్స్ చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం అప్ఘనిస్తాన్ పరిణామాలపై స్పందించారు. తాలిబన్ల తీరుకు సంబంధించి ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో వారి ప్రవర్తనను తప్పుపట్టారు.

చేతిలో ఆయుధాలు పట్టుకొని అధ్యక్ష భవనంలో జల్సాలు చేస్తున్న తాలిబన్లకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ వాళ్లు ఎలాంటి జంతువులనేది ఇది చూస్తేనే అర్థమవుతుందని ట్వీట్ చేశారు. దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేశారు. కాబూల్ లోని ఎమ్యూజ్ మెంట్ పార్కుకు వెళ్లిన తాలిబన్లు అక్కడ చిన్నపిల్లల కార్లలో రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను రాంగోపాల్ వర్మ షేర్ చేస్తూ ‘ఇది నిజం.. తాలిబన్స్ జస్ట్ కిడ్స్’ అంటూ కామెంట్ చేశాడు. ఆర్జీవీ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వర్మ షేర్ చేసిన వీడియోలో అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తాలిబన్లు అక్కడ లగ్జరీ సోఫాలు, కుర్చీలపై కూర్చొని ఠీవీగా దర్జగా అక్కడి భోజనాలను తింటూ ఎంజాయ్ చేశారు. కొందరు కిందే కూర్చుండి గన్స్ పక్కనపెట్టి భోజనాన్ని ఆరగించారు. ఈ వీడియోను షేర్ చేసిన వర్మ వీళ్లు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారని ట్వీట్ లో విమర్శలు గుప్పిస్తున్నారు.

ప్రస్తుతం ప్రజలకు క్షమాభిక్ష పెట్టిన తాలిబన్లు ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలను తమ ప్రభుత్వంలో చేరాల్సిందిగా కోరారు.ఇక జైళ్లలో బంధీలుగా ఉన్న తమ మద్దతుదారులను విడుదల చేస్తున్నారు. ఈ అరాచక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.