Begin typing your search above and press return to search.

ఆన్ డ్యూటీలో భాగంగా డీప్ ఫారెస్టులోకి వెళుతున్న 'రామారావు'

By:  Tupaki Desk   |   13 Oct 2021 7:30 AM GMT
ఆన్ డ్యూటీలో భాగంగా డీప్ ఫారెస్టులోకి వెళుతున్న రామారావు
X
రవితేజ కథానాయకుడిగా శరత్ మండవ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా చేస్తున్నాడు. శరత్ మండవకు ఇది తొలి తెలుగు సినిమా. కానీ ఫస్టు పోస్టర్ తోనే ఆయన అందరి దృష్టిని ఈ సినిమా వైపుకు తిప్పగలిగాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా చాలా వేగంగా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు అడవి నేపథ్యంలో వస్తాయి. ఫారెస్టు నేపథ్యంలో వచ్చే ఈ సీన్స్ ను డీప్ ఫారెస్టులో చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారట. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయనీ, ఉత్కంఠను రేకెత్తిస్తాయని అంటున్నారు.

అలాగే ఈ సినిమాకి సంబంధించిన పాటలను విదేశాల్లో చిత్రీకరించాలనే ఆలోచనలో ఉన్నారు. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో కథానాయికలుగా దివ్యాన్ష కౌశిక్ .. రజీషా విజయన్ అలరించనున్నారు. 'మజిలీ' సినిమా తరువాత దివ్యాన్ష చేస్తున్న సినిమా ఇది. మజిలీ సినిమా హిట్ అయినప్పటికీ, ఆ క్రెడిట్ సమంత - చైతూ ఖాతాలోకి వెళ్లిపోయింది. దాంతో దివ్యాన్షను పట్టించుకునేవారు లేకుండా అయ్యారు. మళ్లీ ఈ సినిమాకి ఆమె అవకాశాన్ని అందుకోగలిగింది.

ఇక నాలుగేళ్లుగా మలయాళంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రజీషా విజయన్. ఈ మధ్యనే ఆమె తెలుగు .. తమిళ భాషలపై దృష్టి పెట్టింది. తెలుగులో ఆమె ఫస్టు మూవీ ఇదే. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఇక ఈ సినిమాకిగల మరో విశేషం ఏమిటంటే, తొట్టెంపూడి వేణు రీ ఎంట్రీ ఇస్తుండటం. గతంలో హీరోగా వేణు కొన్ని సినిమాలు చేశాడు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరువాత కేరక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో కనిపించాడు. హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమైన ఆయన, మళ్లీ ఇంతకాలానికి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రవితేజ .. నక్కిన త్రినాథరావు సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. ఇంతవరకూ మాస్ సినిమాలతో తనదైన ముద్ర చూపిస్తూ వచ్చిన త్రినాథరావు, ఈ సారి కథను కూడా అదే స్టైల్లో సెట్ చేసుకున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను కూడా పూర్తిచేయాలనే ఉద్దేశంతో రవితేజ ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మరో రెండు కొత్త ప్రాజెక్టులను లైన్లో పెట్టనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయట. ఇక రవితేజ తాజా చిత్రంగా 'ఖిలాడి' విడుదలకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.