Begin typing your search above and press return to search.

'బన్నీ నిజమైన మెగాస్టార్.. మిగతా మెగా హీరోలందరూ పరాన్నజీవులు'

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:14 AM GMT
బన్నీ నిజమైన మెగాస్టార్.. మిగతా మెగా హీరోలందరూ పరాన్నజీవులు
X
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరినో ఒకరిని ఏదో రకంగా గిల్లుతూ ఆనందిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో అతి పెద్ద ఫ్యామిలీ అయిన మెగా హీరోలను ఆర్జీవీ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. గతంలో అనేక సందర్భాల్లో మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ వర్మ సెటైరికల్ కామెంట్స్, ట్వీట్స్ చేయడం మనం చూశాం. మెగాస్టార్ చిరంజీవి - పవన్ కళ్యాణ్ మొదలుకొని ఆ కుటుంబం నుంచి వచ్చిన ప్రతీ హీరోపై ప్రత్యక్ష పరోక్ష ట్వీట్స్ చేస్తూ మెగా అభిమానుల ఆగ్రహానికి గురవుతుంటారు.

అయితే ఎందుకో వర్మ చాలా రోజులుగా మెగా హీరోల జోలికి వెళ్లకుండా ఇతర అంశాలపై ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి మళ్ళీ మెగా ఫ్యామిలీ పై పడ్డారు వివాదాస్పద దర్శకుడు. అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగాస్టార్ అని.. పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ సహా ఇతర మెగా హీరోలందరూ పరాన్నజీవులు అని అన్నారు. ఆదివారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగా హీరోలంతా సెలబ్రేషన్స్ లో పాల్గొనడం.. బన్నీ ఈ వేడుకల్లో హాజరు కాలేదనే నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.

''శ్రీ మెగా చిరంజీవి మెగా సక్సెస్ వల్ల నికబడిన వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ - పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - నిహారిక వంటి తక్కువ స్థాయి పరాన్నజీవులతో పోలిస్తే ఈ రోజు అల్లు అర్జున్ ఒక్కడే నిజమైన మెగాస్టార్'' అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. "నేను వారిని పరాన్నజీవులు అని ఎందుకు పిలుస్తున్నానంటే, వారందరూ చిరంజీవి ద్వారా మాత్రమే మనుగడ సాగిస్తున్నారు. కానీ అల్లు అర్జున్ ఎవరి మీద ఆధారపడ లేదు.. కాబట్టి అతను మాత్రమే నిజమైన మెగాస్టార్'' అని వర్మ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

''చిరంజీవి కుమారులు, మేనల్లుళ్లు, మేనకోడళ్లు, మేనమామలు మొదలైన బంధువులపై హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ యొక్క మెగా విజయమే నిజమైన నిజమైన విజయం'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ''చిరంజీవి వేడుకలకు హాజరు కాకపోవడం అల్లు అర్జున్ తెలివైన నిర్ణయం. ఎందుకంటే అతను సెల్ఫ్ మేడ్ స్టార్. మెగా చిరంజీవి విజయాన్ని పీల్చడం ద్వారా ఉన్న పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ - వరుణ్ తేజ్ - సాయి ధరమ్ తేజ్ మొదలైన కుటుంబ పరాన్నజీవులలో అల్లు అర్జున్ చేరకూడదు'' అని వర్మ సెన్సేషనల్ ట్వీట్స్ చేశారు.

ఈరోజు మంగళవారం ఉదయాన్నే హ్యాంగోవర్ ట్వీట్ వేసిన రామ్ గోపాల్ వర్మ ''అసలు మెగాస్టార్ చిరంజీవి తర్వాత ప్రస్తుతం ఉన్న ఏకైక మెగాస్టార్ అల్లు అర్జున్'' అంటూ మెగా ఫ్యాన్స్ మధ్య చిచ్చురేపారు. ఆర్జీవీ వరుస ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీ - అల్లు ఫ్యామిలీ వేర్వేరు అన్నట్లుగా వర్మ చేసిన ట్వీట్స్ పై మెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నారు. ఏదేమైనా, ఎప్పుడూ ఏదో ఒక వివాదం కోసం వెతుకుతున్న వర్మ..మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇది ఇంకెంత దూరం పోతుందో చూడాలి.