Begin typing your search above and press return to search.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో రామ్‌ చరణ్‌

By:  Tupaki Desk   |   23 April 2022 10:32 AM GMT
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో రామ్‌ చరణ్‌
X
మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ రెండు మూడు రోజుల క్రితం పంజాబ్‌ లో జరిగిన షూటింగ్‌ గ్యాప్ లో ఆర్మీ అధికారులను కలిశారు. వారితో ఫోటోలు దిగడంతో పాటు వారితో కలిసి తిన్నారు. వారికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. వారితో చాలా సమయం గడిపిన రామ్‌ చరణ్‌ వారందరిని కూడా సంతోష పర్చారు. కట్ చేస్తే హైదరాబాద్‌ లో కూడా ఆయన మళ్లీ ఆర్మీ తో కలిశారు.

నేడు హైదరాబాద్‌ లోని సికింద్రాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం లో భాగంగా భారత ఆర్మీ గొప్పతనంను మరియు దేశం పట్ల వారు చూపిస్తున్న ప్రేమను కొనియాడారు. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆర్మీ లో పని చేసే వారికి దేశ భద్రత లో ఉన్న వారికి సెల్యూట్‌ చేసి గౌరవించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకా రామ్‌ చరణ్ మాట్లాడుతూ.. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది. దేశం జరుపుకుంటున్న 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. దేశ భద్రత కోసం పాటు పడుతున్న సైనికులను గౌరవించుకోవడం మన అందరి బాధ్యత. మన అందరి జీవితాలు ప్రశాంతంగా ఉన్నాయంటే ఖచ్చితంగా వారి వల్లే అంటూ చరణ్ చెప్పుకొచ్చాడు.

మనం నిల్చుని ఉన్న నేల.. పీల్చే గాలి మొత్తం కూడా వీర జవాన్లు ఇచ్చిందే. అలాంటి వీరులను.. వారి త్యాగాలను ఎప్పటికి మర్చి పోవద్దు. దేశం ప్రశాంతంగా ఉండాలి అంటే అది కేవలం సైనికుల చేతిలోనే ఉంది. కనుక వారి యొక్క గౌరవం ఎప్పుడు తగ్గించవద్దు. ధృవ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం రావడం చాలా సంతోషాన్ని కలిగించింది అన్నాడు.

ఇక చరణ్ ఇటీవలే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని చరణ్ కు పాన్ ఇండియా స్టార్‌ డమ్‌ ను తెచ్చి పెట్టింది. ఇక వచ్చే వారంలో చిరంజీవి ఆచార్య సినిమా రాబోతుంది. ఆ సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటించాడు. మరో వైపు శంకర్‌ దర్శకత్వంలో ఒక భారీ సినిమా ను చరణ్ చేస్తున్నాడు.

ఆ సినిమా ను దిల్‌ రాజు నిర్మిస్తూ ఉంటే కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తుంది. భారీ పాన్ ఇండియా మూవీగా శంకర్‌ దర్శకత్వం లో చరణ్ చేస్తున్న మూవీ తెరకెక్కుతుంది. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.