Begin typing your search above and press return to search.

చరణ్ ను లైన్లో పెట్టేసిన 'జెర్సీ' డైరెక్టర్!

By:  Tupaki Desk   |   14 Nov 2021 11:30 AM GMT
చరణ్ ను లైన్లో పెట్టేసిన జెర్సీ డైరెక్టర్!
X
శంకర్ దర్శకత్వంలో చరణ్ ఒక భారీ సినిమా చేస్తున్నట్టుగా తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. చరణ్ కి ఇది 15వ సినిమా కాగా .. నిర్మాతగా దిల్ రాజుకి 50వ సినిమా. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రాధాన్యతను సంతరించుకున్న కారణంగా, తన కెరియర్లోనే అత్యధిక భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమా చేస్తున్నారు. ఆయన ఈ స్థాయి బడ్జెట్ ను కేటాయించడం .. పాన్ ఇండియా సినిమాను నిర్మించడం ఇదే మొదటిసారి. ఇక తెలుగులో సినిమా చేయడం కూడా శంకర్ కి ఇదే మొదటిసారి. ఇలా ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది.

ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను పూణేలో పూర్తి చేశారు. అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెల్ ను చిత్రీకరించారు. సహజంగానే శంకర్ సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయి. అలాగే ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను డిజైన్ చేశారు. రన్నింగ్ ట్రైన్ నేపథ్యంలో ఒక యాక్షన్ ఎపిసోడ్ ను ఫస్టు షెడ్యూల్లో చరణ్ తదితరులపై చిత్రీకరించారు. ఈ సన్నివేశాలను హెలికాఫ్టర్ ద్వారా చిత్రీకరించారు. ఈ సినిమాలోని హైలైట్స్ లో ఈ ఎపిసోడ్ ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. సాధారణంగా ఫస్టు షెడ్యూల్లో తేలికపాటి సీన్స్ ను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ శంకర్ రిస్కీ ఫైట్ సీన్ ఎంచుకోవడం ఆయన ప్రత్యేకతకి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసిన శంకర్ .. పెద్దగా గ్యాప్ లేకుండానే సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేయడం విశేషం. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఆల్రెడీ హైద్రాబాద్ వచ్చేసిన శంకర్ ఈ షెడ్యూల్ కి సంబంధించిన సీన్స్ పై కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ షెడ్యూల్లో కూడా కీలకమైన సన్నివేశాలనే ప్లాన్ చేశారట. కైరా అద్వాని కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి .. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ప్రతినాయకుడి పాత్రకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. సంగీతానికి శంకర్ ఎంత ప్రాధాన్యతనిచ్చేది అందరికీ తెలుసు. అందువలన ఈ సినిమాకి పాటలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ సినిమా తరువాత చేయవలసిన ప్రాజెక్టును కూడా చరణ్ లైన్లో పెట్టాడు. 'జెర్సీ' సినిమాతో తన సత్తా చాటుకున్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఒక వైపు శంకర్ సినిమా చేస్తూనే మరో వైపున గౌతమ్ సినిమాను కూడా చరణ్ చేయనున్నాడని అంటున్నారు.