Begin typing your search above and press return to search.

పట్టాలెక్కిన ఇండియన్.. జాయినైన రకుల్

By:  Tupaki Desk   |   13 Aug 2019 5:32 AM GMT
పట్టాలెక్కిన ఇండియన్.. జాయినైన రకుల్
X
భారీ చిత్రాల దర్శకుడు శంకర్ '2.0' తర్వాత అట్టహాసంగా కమల్ హాసన్ తో 'ఇండియన్ 2'(భారతీయుడు 2) ను ప్రారంభించారు. '2.0' సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. కానీ 'భారతీయుడు 2' మొదటి షెడ్యూల్ పూర్తయ్యే సమయానికే బడ్జెట్ అదుపు తప్పడంతో లైకా వారు సినిమాను నిలిపివేయడం జరిగింది. '2.0' బడ్జెట్ విషయంలో జరిగిన పొరపాట్లే ఈ సినిమాకు రిపీట్ అవుతున్నాయని భావించి బడ్జెట్ విషయంలో శంకర్ తమకు హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. విధిలేని పరిస్థితుల్లో శంకర్ లైకా వారి కండిషన్స్ కు ఒప్పుకొని అగ్రిమెంట్ సైన్ చేయడంతో మళ్ళీ సినిమా పట్టాలెక్కేందుకు మార్గం సుగమం అయింది.

శంకర్ ముందుగా అనుకున్న బడ్జెట్ లోపే సినిమాను పూర్తి చేస్తానని లిఖితపూర్వక హామీ ఇచ్చారట. దాంతో పాటుగా కమల్ శంకర్ ఇద్దరూ తమ రెమ్యూనరేషన్ల ను తగ్గించుకున్నారని దీంతో లైకావారు 'భారతీయుడు 2' కొత్త షెడ్యూల్ ను ప్రారంభించారని సమాచారం. ఈ సినిమా కొత్త షెడ్యూల్లో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా జాయిన్ అయింది. ఈ సినిమాలో కమల్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్ కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తోంది. సోమవారం నాడు చెన్నైలో రకుల్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నదట. ఆ విషయం వెల్లడిస్తూ రకుల్ ఇన్ స్టా గ్రామ్ లో ఫస్ట్ డే వీడియో ను పోస్ట్ చేసింది.

ఈ అప్డేట్ తో 'భారతీయుడు 2' మళ్ళీ పట్టాలెక్కిన విషయం అందరికీ కన్ఫాం అయింది. ఇప్పటికే పలు కారణాల వల్ల షూటింగ్ డిలే అయింది కానీ ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ సినిమా షూటింగ్ ను చకచకా పూర్తి చేసేందుకు శంకర్ ప్లాన్ చేసుకున్నారట. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.