Begin typing your search above and press return to search.

షారుఖ్ వల్ల 150 కోట్లు నష్టమంటున్న నిర్మాత

By:  Tupaki Desk   |   25 Jan 2017 12:10 PM GMT
షారుఖ్ వల్ల 150 కోట్లు నష్టమంటున్న నిర్మాత
X
హృతిక్ రోషన్ కొత్త సినిమా ‘కాబిల్’ విడుదల తేదీని సినిమా మొదలయ్యేటపుడే ప్రకటించారు. కానీ గత ఏడాదే విడుదల కావాల్సిన షారుఖ్ ఖాన్ సినిమా ‘రాయీస్’ అనుకోకుండా వాయిదా పడి ‘కాబిల్’ విడుదల కావాల్సిన జనవరి 25కే ఫిక్సయింది. దీంతో హృతిక్ సినిమాకు పెద్ద పంచ్ పడింది. బాలీవుడ్లో మామూలుగా రిలీజ్ డేట్ల విషయంలో స్టార్ హీరోలకు ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఒకరితో ఒకరు పోటీ పడకూడదనే అనధికారిక ఒప్పందం ఉంటుంది. దాన్ని దాటి షారుఖ్ ఖాన్ తన సినిమా ‘రాయీస్’ను ‘కాబిల్’తో పోటీకి నిలిపాడు. ఈ విషయమై ‘కాబిల్’ నిర్మాత.. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. షారుఖ్ ఖాన్ దారుణంగా మోసం చేశాడంటూ విమర్శలు గుప్పించాడు.

ఆలస్యంగా వచ్చి తమ సినిమాతో పోటీకి దిగడమే కాక.. దేశవ్యాప్తంగా థియేటర్లను 50-50గా పంచుకోవడానికి ముందు ఎగ్జిబిటర్ల తరఫున అంగీకరించి.. ఆ విషయంలో మాట తప్పాడంటూ షారుఖ్ మీద పరోక్షంగా ధ్వజమెత్తాడు రాకేష్ రోషన్. ‘‘'నేను వేరేవాళ్ల సినిమా గురించి మాట్లాడను. నా సినిమా కాబిల్‌ గురించే మాట్లాడతాను. సినిమా విడుదల విషయంలో మేం షాకయ్యాం. బాధపడ్డాం. నిరాశ చెందాం. ఇలా జరుగుతుందని ఊహించలేదు. గతవారం ఎగ్జిబిటర్లందరితోనూ మాట్లాడి వారికి గంట సినిమా కూడా చూపించాం. రెండు సినిమాలకు 50-50శాతం థియేటర్లు ఇవ్వాలని కోరాం. అందుకు వారు ఒప్పుకొన్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్లా థియేటర్లలో 50-50 షేర్ కు అంగీకారం కుదిరింది. కానీ ఆ తర్వాత వాళ్లు చేసింది చూసి బాధేసింది. మేం మోసపోయామనిపించింది. ఇలా చేయడం సరికాదు. ఇలా జరగడం వల్ల నాకు 150 కోట్ల దాకా ఆదాయంలో కోత పడుతోంది’’ అని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/