Begin typing your search above and press return to search.

అమీర్, షారుఖ్ లకు భయపడ్డ రజనీ

By:  Tupaki Desk   |   15 Jun 2018 6:16 AM GMT
అమీర్, షారుఖ్ లకు భయపడ్డ రజనీ
X
సూపర్ స్టార్ రజనీకాంత్-ఏస్ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా మూవీ ‘2.0’ విడుదలపై నెలకొన్న సందిగ్ధత అంతా ఇంతా కాదు. ఒక పెద్ద సినిమా షూటింగ్.. పోస్ట్ ప్రొడక్షన్లో ఏదైనా ఆలస్యం జరిగితే.. కొన్ని రోజులో.. నెలలో వాయిదా వేస్తారు. కానీ ‘2.0’ మాత్రం మళ్లీ మళ్లీ వాయిదా పడి మొదట అనుకున్న డేటుకి సంవత్సరం తర్వాత కూడా విడుదల కాని పరిస్థితి. గత ఏడాది దీపావళికే రావాల్సిన ఈ చిత్రం ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే. చివరగా ఏప్రిల్ రిలీజ్ డేటిచ్చి మాట తప్పింది చిత్ర బృందం. తాజాగా సంకేతాల ప్రకారం అసలు ఈ చిత్రం ఈ ఏడాదంతా విడుదలే కాదంటున్నారు. వచ్చే ఏడాదికి సినిమాను వాయిదా వేసి కూర్చున్నట్లు చెబుతున్నారు. ఐతే సినిమా ఇంకో మూణ్నాలుగు నెలల్లో రెడీ అయ్యే అవకాశమున్నప్పటికీ సరైన రిలీజ్ డేట్ అందుబాటులో లేకే వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

‘2.0’ కేవలం దక్షిణాది సినిమా కాదు. దీన్ని దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఏడాది చివర్లో ఉండే రెండు మంచి డేట్లను బాలీవుడ్ సూపర్ స్టార్లు అమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్ అట్టిపెట్టేసుకున్నారు. అమీర్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ దీపావళికి.. షారుఖ్ మూవీ ‘జీరో’ క్రిస్మస్ కి షెడ్యూల్ అయ్యాయి. ఈ చిత్రాల్లో దేంతో పెట్టుకున్నా ఉత్తరాదిన రజనీ సినిమాకు దెబ్బ తప్పదు. అలాగే రజనీ సినిమా వల్ల ఖాన్ సినిమాకు దక్షిణాదిన ఇబ్బంది ఎదురవుతుంది. పైగా వాళ్లు ముందే రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్నారు. అలాగని పండగ సీజన్ కానపుడు రిలీజ్ చేస్తే అడ్వాంటేజ్ మిస్సవుతారు. అందుకే ఎలాగూ అవ్వాల్సిన ఆలస్యం అయింది కాబట్టి ఇంకొన్ని నెలలు సినిమాను వాయిదా వేయాలని ఫిక్సయ్యారు. అంతా అనుకూలిస్తే వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్లో ‘2.0’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. నిజానికి ఈ ఏడాది రిపబ్లిక్‌ డేకే ‘2.0’ రావాల్సిందన్న సంగతి తెలిసిందే.