Begin typing your search above and press return to search.

సత్యరాజ్ ను ఆడుకుంటున్న రజినీ ఫ్యాన్స్

By:  Tupaki Desk   |   22 April 2017 7:08 AM GMT
సత్యరాజ్ ను ఆడుకుంటున్న రజినీ ఫ్యాన్స్
X
మొత్తానికి సత్యరాజ్ కన్నడిగులకు సారీ చెప్పేశాడు. ‘బాహుబలి: ది కంక్లూజన్’ విడుదలకు మార్గం సుగమం చేశాడు. ఐతే ఈ క్షమాపణ చెప్పడానికి సత్యరాజ్ ఇంతకాలం ఎందుకు ఎదురు చూశాడు.. సారీ చెప్పనంటూ ఎందుకంత పట్టుదల ప్రదర్శించాడు అన్నదాని వెనుక పెద్ద కథే ఉంది. సారీ చెబితే అడ్డంగా బుక్ అయిపోతాననే ఆయన అలా తటపటాయించారు. ఎందుకంటే తొమ్మిదేళ్ల కిందట రజినీకాంత్ ఇలాగే కన్నడిగులకు సారీ చెబితే ఆయన దాని గురించి ఎద్దేవా చేశారు. రజినీని తప్పుబట్టారు.

కావేరీ జలాలకు సంబంధించిన వివాదంలో కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడాడని అప్పట్లో రజినీకాంత్ సినిమా కుశేలన్ (తెలుగులో కథానాయకుడు) కర్ణాటకలో విడుదల కాకుండా అడ్డుకున్నారు కన్నడిగులు. దీనిపై రజినీ వివరణ ఇచ్చాడు. తాను కన్నడిగులకు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు జరిగిన అన్యాయం గురించి మాత్రమే ప్రస్తావించానని.. ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని కోరాడు. ఇది జరిగాక కావేరీ జలాల వివాదం విషయమై తమిళ పరిశ్రమ పెద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. దీనికి తమిళ పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులందరూ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న శరత్ కుమార్.. రజినీని టార్గెట్ చేశాడు. ఆయన క్షమాపణ చెప్పడం స్వార్థంతో చేసిన పని అన్నాడు. ఆ తర్వాత వేదికెక్కిన సత్యరాజ్ అంతమంది ముందు రజినీని కించ పరిచేలా మాట్లాడాడు. రజినీ క్షమాపణం చెప్పడం తప్పు అని.. తాను ఆయన స్థానంలో ఉండి ఉంటే సినిమా విడుదల కాకపోవడం వల్ల నిర్మాతకు వచ్చే నష్టాన్ని తాను భరించే వాడిని తప్ప క్షమాపణ మాత్రం చెప్పేవాడిని కాదని అన్నారు. అంతే కాక కన్నడిగులకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుని.. బాహుబలి-2 కోసం తనే క్షమాపణ చెప్పాల్సిన స్థితికి తీసుకొచ్చాయి. ఐతే అప్పుడు క్షమాపణలు చెప్పిన రజినీని తప్పుబట్టి.. ఇప్పుడు సత్యరాజ్ చేసిందేమంటూ రజినీ అభిమానులు మండి పడుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన్ని టార్గెట్ చేసుకుని ట్రోలింగ్ మొదలుపెట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/