Begin typing your search above and press return to search.

ఆటోను ఢీ కొట్టిన రజనీకాంత్ కుమార్తె?

By:  Tupaki Desk   |   1 March 2017 4:48 AM GMT
ఆటోను ఢీ కొట్టిన రజనీకాంత్ కుమార్తె?
X
వివాదాలకు దూరంగా ఉంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు భిన్నంగా.. ఆయన కుమార్తె సౌందర్య తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. మితిమీరిన వేగంతో నడుపుతున్న కారును అదుపు చేయటంలో ఫెయిల్ అయి.. ఒక ఆటోను గుద్దేసిన ఉదంతంలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున నాలుగు గంటల వేళలో.. మోతాదు మించిన వేగంతో హుందయ్ క్రెటా కారులో పయనిస్తున్న సౌందర్య.. చెన్నై టీటీకే రోడ్డులోని కర్వ్ లో కారును తిప్పటంలో విఫలమయ్యారు. రోడ్డు మీద నిలిపి ఉంచిన ఆటోను వేగంగా గుద్దటంతో ఆటో బోల్తా పడింది.

ఈ ఘటనలో ఆటో పూర్తిగా డ్యామేజ్ కావటమే కాదు.. ఆటోలో నిద్రపోతున్న ఆటోడ్రైవర్ మణికి గాయాలయ్యాయి. అతడ్ని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. యాక్సిడెంట్ చేసిన కారును నడుపుతున్నది రజనీకాంత్ కుమార్తె సౌందర్యా? కాదా? అన్నదిసందేహమని చెబుతున్నారు. ఎందుకంటే.. కారును ఆమే డ్రైవ్ చేస్తున్న విషయాన్ని ఎవరూ కన్ఫర్మ్ చేయటం లేదు. కాకుంటే.. ఆమె డ్రైవింగ్ సీట్లో ఉన్నట్లుగా ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారాన్ని విన్న వారు చెబుతున్నప్పటికీ.. సాక్ష్యంగా ఎవరూ ముందుకు రాకపోవటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. డ్యామేజ్ అయిన ఆటోకు నష్టపరిహారాన్ని కారులో ఉన్న హీరో ధనుష్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ ఉదంతాన్ని అక్కడి సీసీ కెమేరాలు రికార్డు చేసి ఉంటాయి కదా? అన్న ప్రశ్నకు లేదని చెబుతున్నారు. అక్కడ కెమేరాలు ఉన్నప్పటికీ.. అవి పని చేయటం లేదని అధికారులు చెబుతున్నారు. చెన్నై రోడ్లకు పక్కనే ఆటోల్ని ఉంచేసి.. రాత్రిళ్లు నిద్రపోవటం అలవాటేనని.. అందులో భాగంగానే సదరు ఆటోవాలా నిద్రపోయాడని.. మితిమీరిన వేగంలో కారును నడపటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. అయితే.. ఈ ఉదంతంపై ఇప్పటివరకూ పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవటం.. కేసు నమోదు కాకపోవటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/