Begin typing your search above and press return to search.

నా బిడ్డలిద్దరూ నేను గర్వపడేలా చేశారు: రాజశేఖర్

By:  Tupaki Desk   |   23 Nov 2021 4:40 AM GMT
నా బిడ్డలిద్దరూ నేను గర్వపడేలా చేశారు: రాజశేఖర్
X
తేజ సజ్జ - శివాని జంటగా 'అద్భుతం' సినిమా రూపొందింది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ప్రేమకథా చిత్రం ఇది. ప్రశాంత్ వర్మ కథను అందించిన ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ సంభాషణలు సమకూర్చాడు. మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి, మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.

ఈ నెల 19వ తేదీ నుంచి ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్నరాత్రి ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేదికపై రాజశేఖర్ మాట్లాడారు.

" ఒక ఫాదర్ గా నేను మా అమ్మాయిలను ఎలా పెంచానంటే, నేను లేకుండా వాళ్లని ఎక్కడికీ పంపించను. నేను ఎక్కడికి వెళ్లినా వాళ్లను తీసుకునే వెళతాను. చిన్నప్పుడు వాళ్లు ఆడుతూ పాడుతూ చదువుకునే స్కూల్ లోనే చేర్పించాను. షూటింగ్స్ కోసమని నాతో పాటు వాళ్లని తిప్పుతుంటే స్కూల్ వాళ్లు నన్ను తిడుతూ ఉండేవారు.

కానీ నేను వినిపించుకునేవాడిని కాదు. నన్ను తిడతారని చెప్పేసి ఒక్కోసారి జీవితాను పంపిస్తే, ఆమె తిట్లు తిని వచ్చేసేది. ఒకానొక సందర్భంలో నా పిల్లల కోసం నేనే స్కూల్ పెట్టాను. వాళ్లకి ఇష్టం వచ్చినప్పుడు వెళ్లి చదువుకుని వచ్చేవారు. అలా వాళ్ల ఎడ్యుకేషన్ సాగింది.

వాళ్లిద్దరికీ సినిమాలంటే చాలా ఇష్టం. మెడిసిన్ చదివి .. ఆ తరువాత సినిమాల వైపు రమ్మని వాళ్లతో చెప్పాను. ఎందుకంటే రేపటి రోజున సినిమాలు లేకపోయినా వెళ్లి ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. శివాని హీరోయిన్ గా ఇంతకుముందు ఒక సినిమా ఒప్పుకుంటే అది ఇంతవరకూ పూర్తికాలేదు.

నా బ్యానర్లో నా కూతుళ్లకు సక్సెస్ ను ఇచ్చి వాళ్లను సక్సెస్ ఫుల్ గా నిలబెట్టాలని ఉంది. శివానికి ఇప్పుడు 'అద్భుతం'తో మంచి హిట్ వచ్చింది. ఇక శివాత్మిక గురించి నేను ఆలోచించాలి .. ఆమెకి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది.

అందరూ నాకు కాల్ చేసి ఈ సినిమాను గురించి .. శివాని గురించి మాట్లాడుతుంటే, నాకు చాలా గర్వంగా అనిపించింది. నిన్న ఒక నిర్మాత కాల్ చేసి కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. మా ఇద్దరమ్మాయిలు డాన్స్ బాగా చేస్తారు. ఒక సినిమాలో వాళ్ల డాన్స్ ఉండేలా చూడమని ఆయన అన్నారు.

అందుకనే ఇక్కడున్న దర్శక నిర్మాతలకు ఆ విషయం చెబుతున్నాను. ఈ సినిమా విషయంలో నేను ఎక్కడా జోక్యం చేసుకోకుండా నా పనిని నేను చేసుకున్నాను. 'దొరసాని' .. 'అద్భుతం' సినిమాలతో నా ఇద్దరు కూతుళ్లు నేను గర్వపడేలా చేశారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.