Begin typing your search above and press return to search.

ఢిల్లీ విమానాశ్రయంలోని పరిస్థితులపై రాజమౌళి అసహనం..!

By:  Tupaki Desk   |   2 July 2021 6:27 AM GMT
ఢిల్లీ విమానాశ్రయంలోని పరిస్థితులపై రాజమౌళి అసహనం..!
X
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే దర్శకధీరుడు రాజమౌళి.. సమకాలీన అంశాలపైన, సామాజిక స్పృహను గుర్తు చేసే విషయాలపైనా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో పరిస్థితులపై ట్విట్టర్ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి ఎయిర్‌ పోర్ట్‌ చేరుకున్న రాజమౌళి.. విమానాశ్రయంలో కనీస వసతులు కూడా లేకపోవడంతో అసంతృప్తి చెందినట్లుగా చేస్తూ ట్వీట్ పెట్టారు. దీనికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేశారు.

''లుఫ్తాన్సా ఫ్లైట్ ద్వారా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ కు చేరుకున్నాను. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్స్ కోసం అవసరమైన కొన్ని ఫార్మ్స్ ఇచ్చి నింపమన్నారు. ప్రయాణీకులందరూ ఆ పత్రాలను నేలపై కూర్చుని, గోడపై పత్రాలను ఉంచి నింపుతున్నారు. పరిస్థితి చూడడానికి ఏమీ బాగాలేదు. దీని కోసం టేబుల్స్ ఏర్పాటు చేయడం అనేది సింపుల్ సర్వీస్. అలాగే సర్ప్రైజింగ్ గా బయటకు వచ్చే గేట్ హ్యాంగర్‌ దగ్గర వీధి కుక్కలు చాలా ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మొదట మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి. ధన్యవాదాలు'' అని రాజమౌళి ట్వీట్‌ చేశారు.

'బాహుబలి' దర్శకుడి ట్వీట్ కు నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. మరి జక్కన్న సూచనలపై ఢిల్లీ ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజమౌళి ప్రస్తుతం ''ఆర్.ఆర్.ఆర్'' అనే ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సస్టార్ హీరోలు ఎన్టీఆర్‌ - రామ్ చరణ్ కలసి నటిస్తున్నారు. విప్లవవీరులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్‌ పాత్రల ఆధారంగా కల్పిత కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.