Begin typing your search above and press return to search.

మిత్రుడి కోసం రాజమౌళి వచ్చాడు

By:  Tupaki Desk   |   20 Jun 2017 6:45 AM GMT
మిత్రుడి కోసం రాజమౌళి వచ్చాడు
X
రాజమౌళికి ఇండస్ట్రీలో మిత్రులు తక్కువమందే. కానీ ఆ మిత్రులకు సాయం చేయడానికి రాజమౌళి ఎప్పుడూ రెడీగా ఉంటాడు. రాజమౌళికి అత్యంత ఆప్తులైన ఆ మిత్రుల్లో సాయి కొర్రపాటి ఒకరు. జక్కన్నతో ‘ఈగ’ లాంటి సాహసోపేత సినిమాను రాజీ లేకుండా తీసి తన అభిరుచిని చాటుకున్నాడు. రాజమౌళికీ చేరువయ్యాడు. ఇక అప్పట్నుంచి సాయితో తన బంధాన్ని కొనసాగిస్తున్నాడు జక్కన్న. సాయితో కలిసి ‘అందాల రాక్షసి’ సినిమాను నిర్మించడమే కాదు.. ఆ తర్వాత కూడా తన మిత్రుడికి అండగా నిలుస్తూ వస్తున్నాడు. తాజాగా సాయి కొర్రపాటి సమర్పణలో తెరకెక్కిన కొత్త సినిమా ‘రెండు రెళ్లు ఆరు’ ఆడియో వేడుకకు జక్కన్న ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

కొన్ని నెలలుగా ‘బాహుబలి-2’ పనులతో తీరిక లేకుండా గడిపి.. ఆపై విహార యాత్రకు వెళ్లొచ్చిన రాజమౌళి.. సుదీర్ఘ విరామం తర్వాత ఓ బయటి సినిమా వేడుకకు అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా తన మిత్రుడి గురించి.. ఆయన సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడాడు రాజమౌళి. ‘‘సాయిగారికి జనాల పల్స్‌ బాగా తెలుసు. ‘ఈగ’ను చిన్న సినిమాగా తీద్దాం అనుకుంటే ఆయన వచ్చి దాన్ని పెద్ద సినిమా చేశారు. ‘రెండు రెళ్లు ఆరు’ గురించి చాలా ఎగ్జైట్‌ అవుతూ చెప్పారు. చిన్న సినిమా కథలో ఏదో ఒక ఆసక్తికర పాయింట్‌ లేకపోతే జనాలు చూడరు. ఇందులో మంచి పాయింట్‌.. ఎంటర్టైన్మెంట్.. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. ట్రైలర్‌.. పాటలు కూడా బావున్నాయి. తప్పకుండా మంచి సినిమా అవుతుందని ఆశిస్తున్నా’’ అని రాజమౌళి తెలిపాడు. నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రెండు రెళ్లు ఆరు2లో కొత్త హీరో హీరోయిన్లు అనిల్-మహిమ జంటగా నటించారు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్నందించాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/