Begin typing your search above and press return to search.

భరత్ నే భయపడేలా చేస్తోంది

By:  Tupaki Desk   |   7 April 2018 5:40 AM GMT
భరత్ నే భయపడేలా చేస్తోంది
X
ఈ రోజు సాయంత్రం భరత్ అనే నేను బహిరంగ సభ పేరిట ఎల్బి స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు పూర్తైపోయాయి. తెలుగు రాష్ట్రాల వివిధ జిల్లాల నుంచి అభిమానులు అక్కడికి చేరుకోవడం ఇప్పటికే మొదలుపెట్టేసారు. కాని ప్రకృతి మాత్రం భరత్ ని బాగా టెన్షన్ పెడుతోంది. నిన్నటి నుంచి జంట నగరాల్లో వాతావరణం ఓ మోస్తరుగా చిరు జల్లులు కురవడంతో పాటు ఈ రోజు సాయంత్రం లోపు వర్ష సూచన పుష్కలంగా ఉండటంతో బహిరంగ సభకు అంతరాయం ఏర్పడుతుందేమో అని యూనిట్ బాగా ఆందోళన చెందుతోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా ఆడియో వేడుక ఇలా స్టేడియం లాంటి ఓపెన్ ప్లేస్ లో జరగలేదు. అభిమాన సందోహం భారీగా తరలి రావాలనే ఇలా సెట్ చేసారు కాని ఇప్పుడు ఇదే భరత్ ని చిక్కుల్లో పడేసేలా ఉంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తుండటంతో తారక్ ఫాన్స్ కూడా పెద్ద సంఖ్యలోనే హాజరు కానున్నారు. పైగా జై లవకుశ వేడుక తర్వాత తమ హీరోను నేరుగా చూసే అవకాశం ఇంతవరకు వాళ్ళకు దక్కలేదు. సో మహేష్ ఫాన్స్ హంగామా తో పాటు తారక్ అభిమానుల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. వర్షం దెబ్బకు ఏ మాత్రం అటు ఇటు అయినా స్టేడియం పరిసరాలలో ట్రాఫిక్ జాంతో పాటు ప్రోగ్రాం కనక సజావుగా జరగకపోతే వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశలో కొంత అల్లరి చేసే అవకాశం ఉంది. కాబట్టి వరుణ దేవా రావొద్దు అని గట్టిగా ప్రార్థన చేయాల్సి వచ్చేలా ఉంది. విడుదలకు కేవలం 13 రోజులే ఉంది. ఈ రోజు వర్షం వల్ల తేడా వస్తే మళ్ళి చేసే అవకాశం లేదు. చేసినా స్పందన ఆశించడం కష్టమే.

సో భరత్ బహిరంగ సభ సజావుగా జరగాలి అంటే వర్షం రాకుండా ఉండటం తప్ప వేరే మార్గం లేదు. ఓపెనింగ్స్ పరంగా కలెక్షన్స్ పరంగా రంగస్థలం విసిరిన ఛాలెంజ్ ని భరత్ అనే నేను ఎంతవరకు అందుకుంటుంది అనే దాని మీద అభిమానులు ఇప్పటికే గంపెడంత ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఏదో అపశకునంలాగా వర్షం కనక ఫంక్షన్ కి బ్రేక్ వేస్తే ఫాన్స్ డిస్ట్రబ్ కావడం ఖాయం. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే పాట గుర్తొస్తోంది ఇది విన్న వాళ్ళకు.