Begin typing your search above and press return to search.

నాతో నలుగురు ఉండింటే వాళ్ల పని అయ్యేదే.. దాడిపై రాహూల్ వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 March 2020 8:59 AM GMT
నాతో నలుగురు ఉండింటే వాళ్ల పని అయ్యేదే.. దాడిపై రాహూల్ వ్యాఖ్యలు
X
పబ్ లో ప్రముఖ గాయకుడు రాహూల్ సిప్లిగంజ్ పై దాడి జరిగి రెండు రోజులైనా ఎలాంటి పరిణామం చోటుచేసుకోలేదు. పోలీసులు దీనిపై ఇంతవరకు స్పందించలేదు. స్వయంగా తనపై దాడి జరిగిందని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌ కు వచ్చి ఫిర్యాదు చేసినా ఎలాంటి ముందడుగు పడలేదని తెలుస్తోంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాహూల్ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆశ్రయించినా ఆయన స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో తనకు న్యాయం జరగాలని కోరుతూ తన అభిమానులతో పాటు నెటిజన్లను కోరుతూ వీడియోలు పోస్ట్ చేశాడు.

‘‘బిగ్‌బాస్ నుంచి వచ్చాక ఫ్రెండ్స్‌కి పార్టీలు అవీ ఇవ్వాలని అనుకున్నా. కానీ మొన్న పబ్‌లో జరిగిన గొడవ తర్వాత నేనే అమ్మాయిల్ని వేసుకుని వెళ్లాను కాబట్టి నేనే వాళ్లని గెలికాను అనుకుంటున్నారు. నేను ఎవరి జోలికీ వెళ్లను. కానీ మొన్న మాత్రం పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కదా అని నేను ఒక్కడినే ఉన్నానని నన్ను టార్గెట్ చేశారు. అందరికీ సర్కిల్ ఉంటది.. అది ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. ఆ సమయంలో నా వెంట నలుగురు ఉండింటే వారి పని అయ్యేదే. నేను ఏమీ అడగడం లేదు. నాకు న్యాయం కావాలి. తప్పు నాదైతే పడతా. తప్పు నాది కానప్పుడు నన్ను గెలికితే నేను ఎందుకు ఊరుకుంటా. మీ చిచ్చాకి న్యాయం జరగాలి రా. అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేను సీసీటీవీ ఫుటేజ్ మీడియాకు ఇచ్చిన" అని సోషల్ మీడియాలో వీడియో పెట్టాడు.

అయితే ఈ కేసు మరుగన పడుతుందని రాహూల్ ఆందోళన చెందుతున్నాడు. తనకు న్యాయం జరగాలని ప్రధానంగా ఆయన కోరుతున్నాడు. ఈ వీడియోలను సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ తనకు మద్దతుగా నిలవాలని తన అభిమానులను, ప్రజలను రాహూల్ సిప్లిగంజ్ కోరాడు. తన తప్పు లేదని మరోసారి స్పష్టం చేస్తూ తనకు న్యాయం కావాలని ఆశిస్తున్నాడు.

ప్రిజమ్ పబ్ లో తన స్నేహితురాలితో రాగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు ఉద్దేశపూర్వకంగా అతడి మిత్రులతో కలిసి దాడి చేసిన విషయం తెలిసిందే. వాష్ రూమ్ నుంచి కొందరు వస్తూ తనను డ్యాష్ ఇవ్వగా.. ఎందుకు ఎలా చేస్తున్నారని రితేశ్ రెడ్డి తనను దుర్భాషలాడుతూ వెళ్లిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను కోరాడు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేశ్ రెడ్డే దాడి చేయడంతో ఈ వ్యవహారంలో ప్రభుత్వ జోక్యం ఉంటుందని భావించిన రాహూల్ ఈ సందర్భంగా కేటీఆర్ కు ట్వీట్ చేశారు. శుక్రవారం ఈ మేరకు చేసిన ట్వీట్ ఇది..
‘నాకు న్యాయం కావాలి.. పబ్‌లో జరిగిన గొడవపై చాలామందికి సందేహాలు ఉన్నాయి. అందుకే ఈ వీడియో పెడుతున్నా.. తప్పు ఎవరిదో మీరే చెప్పండి. పబ్‌ లోపల ఏం జరిగిందో వాళ్లు నన్ను రౌండప్ చేసి ఎలా దాడి చేశారో మీకు మీరుగా చూడండి. ఎవరిది తప్పో మీరే చెప్పండి. కేటీఆర్ సార్.. నేను ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నాం... నేను ఓటు కూడా టీఆర్ఎస్‌కే వేశా.. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి. దయచేసి ఈ వీడియో చూసిన తరువాత మీరే న్యాయం చేయండి’ అంటూ సీసీ టీవీ ఫుటేజ్‌ను రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ చేశాడు.

అయితే రాహూల్ కు మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. రాహూల్ కు న్యాయం చేయాలని వారు కూడా పోస్టులు చేస్తూ పోలీసులకు, కేటీఆర్ కు ట్వీట్లు చేస్తున్నారు. మరి దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తాడో.. ఆ కేసు ఎంతవరకు ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.