Begin typing your search above and press return to search.

పల్లె కోయిల పాటకు ప్రేక్షకులు ఫిదా

By:  Tupaki Desk   |   2 Feb 2019 4:48 PM GMT
పల్లె కోయిల పాటకు ప్రేక్షకులు ఫిదా
X
పసల బేబి.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్‌ మీడియా ద్వారా ఒక్కసారిగా స్టార్‌ అయిన ఈమె సింగర్‌ గా స్టార్‌ అయ్యింది. కనీసం ఒక్క పాట కూడా సినిమాల్లో పాడకుండానే బేబి సింగర్‌ గా ప్రశంసలు దక్కించుకుంది. మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా ఇంటికి పిలిచి సన్మానించడంతో పాటు ఏఆర్‌ రహమాన్‌ బేబి పాటకు ఫిదా అవ్వడంతో ఆమె స్థాయి అమాంతం పెరిగింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన బేబిలో ఉన్న అద్బుతమైన ప్రతిభను గుర్తించిన రఘు కుంచె ఆమెతో 'పలాస 1978' అనే చిత్రంలో ఒక పాట పాడించాడు.

సినిమాలోని పాటకంటే ముందే ఒక ప్రైవేట్‌ సాంగ్‌ ను సింగర్‌ బేబితో రఘు కుంచె పాడించిన విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం మట్టిమనిషినండి నేను.. అంటూ సాగిన ఆ పాట ప్రోమో వచ్చింది. ప్రోమోతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రఘు కుంచె తాజాగా పూర్తి పాటను యూట్యూబ్‌ ద్వారా విడుదల చేశాడు. జనవరి 31వ తేదీన ఈ పాటను రఘు కుంచె యూట్యూబ్‌ లో పోస్ట్‌ చేయగా, కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 7.5 లక్షల వ్యూస్‌ ను సొంతం చేసుకుంది. దాదాపు 70 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లోనే మిలియన్‌ మార్క్‌ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి పల్లె కోయిలమ్మ పాటకు ప్రేక్షకులకు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాల్లో కూడా ఈమె వరుసగా పాటలు పాడేందుకు సిద్దం అయ్యింది.