Begin typing your search above and press return to search.

ఈసారి దర్శకేంద్రుడి వంతు..!

By:  Tupaki Desk   |   31 Oct 2021 1:30 AM GMT
ఈసారి దర్శకేంద్రుడి వంతు..!
X
ఎన్నిసార్లు చదివినా.. ఎన్నిసార్లు విన్నా తనవి తీరని మహాకావ్యం రామాయణం. ఈ ఇతిహాస గాథ ఆధారంగా ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చే కొద్దీ.. సరికొత్తగా రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఫిలిం మేకర్స్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ త్రీడీ లోరూపొందిస్తున్న 'ఆదిపురుష్' సినిమా కూడా రామాయణం ఆధారంగానే తెరకెక్కుతున్నదే.

అలానే 'బాహుబలి' రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ ''సీత: ది ఇంకార్నేషన్'' అనే సినిమాకి శ్రీకారం చుట్టారు. అలౌకిక్ దేశాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇది సీత కోణంలో ఉండబోతుంది. 'రామాయణం' నేపథ్యంలో 3డీలో రూపొందించడానికి అల్లు అరవింద్ - మధు మంతెన - నమిత్ మల్హోత్ర వంటి నిర్మాతలు ప్రయత్నాలు చేశారు. నితీష్ తివారి - రవి ఉద్యవార్ వంటి ఇద్దరు దర్శకులతో చేయాలని ప్లాన్ చేశారు. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా రామాయణం ఆధారంగా సినిమా చేయడానికి సంకల్పించారని తెలుస్తోంది.

సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పౌరాణిక చిత్రాలను తనదైన శైలిలో అవిష్కరిస్తారనే సంగతి తెలిసిందే. 'అన్నమయ్య' 'శ్రీరామదాసు' 'శిరిడి సాయి' 'ఓం నమో వెంకటేశాయ' వంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. ఇటీవల 'పెళ్లి సందD' చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఆయన.. ఇప్పుడు రామాయణం కోసం మెగా ఫోన్ పట్టబోతున్నారట. కన్నడ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని టాక్ వినిపిస్తోంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టార్ క్యాస్టింగ్ తో ఇతిహాస రామాయణ గాథను రాఘవేంద్రరావు కొత్తగా చూపించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. దీనికి సంబంధించిన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబడతాయని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.