Begin typing your search above and press return to search.

UV వారి చిన్న సినిమాలపై 'రాధేశ్యామ్' వాయిదా ఎఫెక్ట్..?

By:  Tupaki Desk   |   12 Jan 2022 8:30 AM GMT
UV వారి చిన్న సినిమాలపై రాధేశ్యామ్ వాయిదా ఎఫెక్ట్..?
X
టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతోంది 'యూవీ క్రియేషన్స్'. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 'యూవీ కాన్సెప్ట్స్' అనే అనుబంధ సంస్థను స్థాపించి చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు.. ప్రేక్షకులకు కంటెంట్ బేస్డ్ సినిమాలను అందిస్తూ మంచి అభిరుచి గల నిర్మాతలు అనిపించుకున్నారు వంశీ - ప్రమోద్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ''రాధేశ్యామ్'' అనే పీరియాడికల్ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. దీనికి తగ్గట్టుగానే ప్రచార కార్యక్రమాలు చేశారు. గత మూడేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవుతుండంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కోరలు చాచడంతో ప్రభాస్ సినిమాని వాయిదా వేశారు.

అయితే భారీ బడ్జెట్ తో రూపొందించిన 'రాధేశ్యామ్' వాయిదా పడటం, ప్రస్తుతం UV క్రియేషన్స్‌ పై రూపొందే ఇతర చిన్న సినిమాల మీద పరోక్షంగా ప్రభావం చూపిందని టాక్ నడుస్తోంది. అగ్ర నిర్మాతలు తమ బ్యానర్ లో పలు స్మాల్ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు రాధే శ్యామ్ పోస్ట్ పోన్ అవడంతో వాటి నిర్మాణాలను నిలిపివేశారట. ప్రస్తుతం యూవీ టీమ్ కేవలం ప్రొడక్షన్ నెం.14 పైనే దృష్టి సారించారని అంటున్నారు.

అనుష్క శెట్టి - నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రల్లో యూవీ నిర్మాతలు ఇటీవలే ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది స్వీటీ శెట్టికి 48వ సినిమా.. పొలిశెట్టికి హీరోగా మూడో చిత్రం. 'రారా కృష్ణయ్య' ఫేమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పుడు స్టార్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా మాత్రమే నిర్మాణం జరుపుకుంటోందని టాక్ వినిపిస్తోంది. 'రాధే శ్యామ్' విడుదల తర్వాత ఎప్పటిలాగే మిగతా సినిమాల చిత్రీకరణలు పునఃప్రారంభమవుతాయని అనుకుంటున్నారు.

ఇకపోతే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నారు. 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నారు. అలానే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో 'స్పిరిట్' అనే సినిమాని UV టీమ్ నిర్మించనుంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ టీ సిరీస్ భూషణ్ కుమార్ తో కలిసి వంశీ - ప్రమోద్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.