Begin typing your search above and press return to search.

పునీత్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన పుష్ప‌రాజ్‌

By:  Tupaki Desk   |   3 Feb 2022 10:30 AM GMT
పునీత్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన పుష్ప‌రాజ్‌
X
దివంగ‌త క‌న్నడ న‌టుడు, ప‌వ‌ర్ స్టార్‌ పునీత్ రాజ్ కుమార్ గ‌త ఏడాది అక్టోబ‌ర్ 29న‌ హ‌ఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఈ వార్త విని పునీత్ అభిమానుల‌తో పాటు ద‌క్షిణాది సెలబ్రిటీలు షాక్ కు గుర‌య్యారు. ఎంతో మందిని పునీత్ అకాల మ‌ర‌ణం శోక సంద్రంలోకి నెట్టేసింది. ఆయ‌న చనిపోయి నెలలు గ‌డుస్తున్నా సెల‌బ్రిటీలు, అభిమానులు ఆయ‌న‌ని ఇప్ప‌టికీ త‌లుచుకుంటూనే వున్నారు.

తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బెంగ‌ళూరు వెళ్లారు. గురువారం ప్ర‌త్యేకంగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌ని క‌లిసి అల్లు అర్జున్ ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల `పుష్ప‌` మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల కోసం బ‌న్నీ బెంగ‌ళూరు వెళ్లారు కానీ పునీత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్ల‌లేక‌పోయారు. దీంతో గురువారం ప్ర‌త్యేకంగా పునీత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికే బ‌న్నీ బెంగ‌ళూరు వెళ్ల‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా పునీత్ రాజ్ కుమార్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు పునీత్ సోద‌రుడు, హీరో శివ‌రాజ్‌ కుమార్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ని క‌లుసుకున్నారు. ముందు శివ‌రాజ్ కుమార్ నివాసానికి వెళ్లిన అల్లు అర్జున్ ఆ త‌రువాత అక్క‌డి నుంచి క‌న్న‌డ కంఠీర‌వ స్టూడియోకు వెళ్లారు. పునీత్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయ‌న‌కు నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా పునీత్ ఫోటోకి దండం పెట్టి చేతితో తాకుతూ భావోద్వేగానికి లోన‌య్యారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట‌ వైర‌ల్ గా మారాయి.

`నాకు పునీత్ ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం. ఆయ‌న మా ఇంటికి వ‌చ్చేవారు. భోజ‌నం క‌లిసి చేసేవాళ్లం. నేను బెంగ‌ళూరు వెళ్లిన‌ప్పుడు త‌ప్ప‌కుండా క‌లిసే వాళ్లం. స‌డ‌న్ గా ఆయ‌న లేరు అన‌గానే నేను చాలా షాక్ కు గుర‌య్యాను` అని పునీత్ మృతి అనంత‌రం జ‌రిగిన ఓ సినిమా కార్య‌క్ర‌మంలో బ‌న్నీ భావోద్వేగానికి లోన‌య్యారు.