Begin typing your search above and press return to search.

బాలీవుడ్ దర్శకులపై 'పుష్ప' నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!

By:  Tupaki Desk   |   31 Jan 2022 9:38 AM GMT
బాలీవుడ్ దర్శకులపై పుష్ప నిర్మాత సంచలన వ్యాఖ్యలు..!
X
తెలుగు చిత్రాలకు ఇప్పుడు ఉత్తరాదిలో మంచి క్రేజ్ ఉంది. మన సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే మిలియన్ల కొలదీ వ్యూస్ రాబడుతుంటాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలను గోల్డ్‌ మైన్స్ టెలిఫిల్మ్స్‌ కు చెందిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మనీష్ షా కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు తాజాగా 'పుష్ప: ది రైజ్' సినిమాతో మనీష్ భారీ విజయాన్ని అందుకున్నారు.

'పుష్ప' సినిమాకు సంబంధించిన హిందీ రైట్స్ తీసుకున్న గోల్డ్‌ మైన్స్ వారు ముందుగా యూట్యూబ్ లో విడుదల చేయాలని భావించారని వార్తలు వచ్చాయి. దీంతో ఈ సినిమా హిందీలో థియేటర్లలోకి వస్తుందో లేదో అనే కన్ఫ్యూజన్ అందరిలో నెలకొంది. అయితే అనేక పరిణామాల తర్వాత పుష్ప పార్ట్-1 థియేట్రికల్ రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో నార్త్ ఆడియన్స్ ముందుకు వచ్చిన 'పుష్ప' మొదటి భాగం హిందీ వెర్సన్ అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద వసూళ్ళు రాబట్టింది. కరోనా థర్డ్ వేవ్ - నైట్ కర్ఫ్యూల ప్రభావం మరియు 50% ఆక్యుపెన్సీ నిబంధనలను తట్టుకొని కూడా 100 కోట్ల మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో గోల్డ్‌ మైన్స్ మనీష్ షా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'పుష్ప' లాంటి సక్సెస్ ఫుల్ యాక్షన్ సినిమాని హిందీలో ఎందుకు తీయలేకపోతున్నారనే విషయం మీద మాట్లాడుతూ.. బాలీవుడ్ దర్శకులు యాక్షన్ సినిమాలు చేస్తారని ఆశించకూడదని.. ఎందుకంటే వాళ్ళు దానిని తక్కువ మార్కెట్‌ గా చూస్తుంటారని మనీష్ పేర్కొన్నాడు.

''మా దర్శకులు చాలా మంది ముంబైలోని అంధేరి మరియు బాంద్రా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దేశం మొత్తం అంధేరి - బాంద్రా మధ్య నివసిస్తుందని.. అందరూ నెట్‌ ఫ్లిక్స్ మరియు అమెజాన్‌ లనే చూస్తారని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళ నుంచి యాక్షన్ సినిమాలను ఆశించకూడదు'' అని మనీష్ షా అన్నారు.

వాస్తవానికి ఈ మధ్య కాలంలో బాలీవుడ్ చిత్రాలను పరిశీలిస్తే, ఏ ఒక్క సినిమా ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్ సాధించలేకపోయింది. అక్కడి స్టార్ హీరోలు నటించిన చిత్రాలు కూడా 'పుష్ప' రేంజ్ బిజినెస్ చేయలేకపోయాయి. అందుకే ఇప్పుడు దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఈ క్రమంలో భారీ ధరకు మన చిత్రాల రైట్స్ కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు.


ఇకపోతే 'పుష్ప: ది రైజ్' సినిమా సూపర్ సక్సెస్ అవడంతో రెండో భాగం 'పుష్ప: ది రూల్‌' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మార్కెట్ లో అల్లు అర్జున్ కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకోడానికి మనీష్ షా.. 'అల వైకుంఠపురములో' చిత్రాన్ని హిందీలో డబ్బింగ్ చేసి థియేట్రికల్ చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే ఆల్రెడీ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న మేకర్స్ నుంచి అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు 'అల..' ను డైరెక్ట్ టీవీలో ప్రీమియర్ గా ప్రసారం చేస్తున్నారు.