Begin typing your search above and press return to search.

ప్రీమియర్స్ లో 'పుష్ప' తగ్గేదే లే..!

By:  Tupaki Desk   |   15 Dec 2021 7:30 AM GMT
ప్రీమియర్స్ లో పుష్ప తగ్గేదే లే..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ''పుష్ప'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రిస్మస్ పండక్కి వారం ముందుగా ఈ శుక్రవారం (డిసెంబర్ 17) 'పుష్ప: ది రైజ్' వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే భారత కాలమానం ప్రకారం గురువారం యూఎస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. సినిమా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేది ప్రీమియర్స్ ద్వారానే కాబట్టి.. పుష్ప మాస్ పార్టీ కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

అడ్వాన్స్ బుకింగ్స్ లో 'పుష్ప' పార్ట్-1 సినిమా అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే ఫస్ట్ డే దాదాపుగా అన్ని షోల టికెట్స్ అయిపోయి హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతున్నారు. ఇక యూఎస్ ప్రీ బుకింగ్ సేల్స్ లోనూ పుష్ప తన రేంజ్ ఏంటో చూపించింది. ఒక గంటలోనే 350K డాలర్లకు పైగా ప్రీ సేల్స్ తో దూసుకుపోతోంది. అయితే బన్నీ సినిమా ప్రీమియర్ షోలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేశాయి.

'పుష్ప: ది రైజ్' ఫైనల్ కాపీ ఇంకా రెడీ కాలేదని.. సుకుమార్ దీనిపై వర్క్ చేస్తూనే ఉన్నారని ట్విట్టర్ వేదికగా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇది ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ అభిమానులతో పాటుగా సినీ ప్రియులను నిరుత్సాహ పరిచింది. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిబ్యూటర్స్ సోషల్ మీడియా వేదికగా డౌట్స్ క్లియర్ చేసారు. 'పుష్ప' సినిమా ప్రీమియర్ షోలు ఎట్టిపరిస్థితుల్లోనూ షెడ్యూల్స్ ప్రకారం ప్రదర్శించబడతాయని స్పష్టం చేసారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

కాకపోతే యూఎస్ మరియు నార్త్ సర్కిల్స్ లో 'పుష్ప: ది రైజ్' సినిమాపై 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ప్రభావం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ అల్లు అర్జున్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం అక్కడ షోల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక దక్షిణాదిలోబన్నీ సినిమాకు ఎలాంటి డోకా లేదు. ఇటీవల వచ్చిన 'అఖండ' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న 'పుష్ప' సినిమా ఎలాంటి విజయాన్నినమోదు చేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా, శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ గా అలరించనున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా.. ఫహద్ ఫాజిల్‌ - అనసూయ - సునీల్‌ - అజయ్ ఘోష్ - అజయ్ - ధనుంజయ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. ముత్తం శెట్టి మీడియా సహకారంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలు కలిపి ప్రపంచవ్యాప్తంగా 3 వేలకిపైగా థియేటర్లలో విడుదల కానుంది.