Begin typing your search above and press return to search.

'పుష్ప' లో స్మగ్లింగ్ ఒక్కటే కాదు.. అంతకు మించి..!

By:  Tupaki Desk   |   11 Dec 2021 1:30 PM GMT
పుష్ప లో స్మగ్లింగ్ ఒక్కటే కాదు.. అంతకు మించి..!
X
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా ''పుష్ప: ది రైజ్''. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన మేకర్స్.. ఇటీవల ట్రైలర్ ను లాంచ్ చేశారు.

పుష్పరాజ్ గా బన్నీ ఊర మాస్ అవతారాన్ని చూపించిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రధాన నటీనటుల పాత్రలు - అడవి నేపథ్యంలో అబ్బురపరిచే యాక్షన్ ఘట్టాలు - బన్నీ చిత్తూరు యాసలో చెప్పిన డైలాగ్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నట్లు 'పుష్ప' ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన స్టోరీ అని ట్రైలర్ ద్వారా మరోసారి స్పష్టం అయింది. కాకపోతే ఇందులో అదొక్కటే ప్రధానాంశంగా ఉండదని.. అంతకు మించిన కథ ఇందులో చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.

శేషాచలం అడవుల్లో సెట్ చేయబడిన 'పుష్ప' చిత్రంలో పవర్ డైనమిక్స్ గురించి సుకుమార్ చెప్పబోతున్నారట. పవర్ డైనమిక్స్ అనేది కొంతమంది వ్యక్తుల మధ్య సంబంధాన్ని పవర్ ఎలా ప్రభావితం చేస్తుందో వివరిస్తుంది. ఇప్పుడు సుక్కూ ఈ సినిమాలో ఇదే చూపించబోతున్నారట. చిత్ర నిర్మాతలు లేటెస్టుగా మీడియా సమావేశంలో చెప్పిన వివరాలను బట్టి ఇది నిజమేమో అనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని - రవిశంకర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'పుష్ప' సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. సినిమా అంతా అదే ఉండదని తెలిపారు. ఇది హ్యూమన్ వాల్యూస్ - భావోద్వేగాలు కలబోసిన చక్కని అనుభూతినిచ్చే సినిమా అని పేర్కొన్నారు.

సుకుమార్‌ ఈ చిత్రాన్ని పక్కా మాస్‌ కథతో తీసినా.. తనదైన క్లాస్‌ టచ్‌ తప్పకుండా ఉంటుందని.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే అంశాలు చాలా ఉన్నాయని నిర్మాతలు చెప్పారు. యాక్షన్‌ సీన్స్ చాలా సహజంగా, కథకి తగ్గట్టుగా ఉంటాయని తెలిపారు. ప్రతి పాత్రకూ ఓ కథ ఉంటుందని.. ప్రతీ పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుందని 'పుష్ప' నిర్మాతలు వివరించారు.

కాగా, 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఫహద్ ఫాజిల్‌ తో పాటు అనసూయ - సునీల్‌ - అజయ్ ఘోష్ - అజయ్ - ధనుంజయ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. రేపు హైదరాబాద్ లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'పుష్ప: ది రైజ్' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వేలకిపైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.