Begin typing your search above and press return to search.

లొకేషన్స్ వేటలో 'పుష్ప' పడుతున్న పాట్లు...!

By:  Tupaki Desk   |   31 May 2020 11:43 AM GMT
లొకేషన్స్ వేటలో పుష్ప పడుతున్న పాట్లు...!
X
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో 'పుష్ప' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం.. 'అల వైకుంఠపురంలో' సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో అందరూ ఈ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేసారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన అంతా తారుమారు అయింది. దీనికి తోడు ఇప్పట్లో బయట రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందువల్ల కేరళ షెడ్యూల్ పూర్తిగా రద్దు చేసుకున్నారట. ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో జరిగే స్టోరీ కావడంతో దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయాలని భావించి కేరళ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్‌‌ గానే షూటింగ్ చేయాలని డిసైడ్ అయ్యిందంట చిత్ర యూనిట్.

అందుకే మన తెలుగు రాష్ట్రాల్లోనే దట్టమైన అడవులతో ఉండే ప్రదేశాలను.. షూటింగ్ కి అనుకూలంగా ఉండే ప్రదేశాలను చిత్ర బృందం వెతకడం స్టార్ట్ చేసిందట. దానికోసం గోదావరి పరిసర ప్రాంతాలను.. చిత్తూరు అడవులను పరిశీలించారట. చివరికి పశ్చిమ గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలోని మారేడ్పల్లి దట్టమైన అరణ్యంలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే జగన్ ప్రభుత్వం షూటింగులకు అనుమతించడంతో ఏపీలోనే సినిమా చిత్రీకరణ పెట్టుకుంటే మంచిదని భావించారట. ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో మారేడ్పల్లిలో 'పుష్ప'కి సంభందించిన సెట్స్ వేయడం స్టార్ట్ చేశారట. పోలీసుల పర్మిషన్ వచ్చిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ రెడీగా ఉందట. మొత్తం మీద ఈ పాటికి కేరళ అడవుల్లో చాలా భాగం షూటింగ్ జరుపుకోవాల్సిన 'పుష్ప' మహమ్మారి వైరస్ కారణంగా ఇన్ని పాట్లు పడేలా చేసిందని సినీ అభిమానులు అంటున్నారు. కాగా లోకల్ సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు వంద శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారని.. మన లొకేషన్స్ లో తెరకెక్కబోతున్న లోకల్ సినిమా అని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు.

'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది. రాయలసీమ చిత్తూరు యాస, భాషతో పాటు బన్నీ ఊర మాసు.. మొరటు కుర్రాడిగా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో పలువురు ఇతర ఇండస్ట్రీల నటీనటులు కూడా 'పుష్ప'లో నటిస్తున్నారని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.